Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 పద్దులపై అసెంబ్లీలో చర్చ
- మూడు బిల్లుల ఆమోదం :మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
శాసనసభ సమావేశాల్లో మూడు బిల్లులు ఆమోదం పొందాయని, 40 పద్దులపై సుదీర్ఘ చర్చ జరిగిందని శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పది రోజులు ,శాసన మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయని చెప్పారు. శాసన సభ 58 గంటల ఆరు నిమిషాలు, మండలి 17గంటలు జరిగిందని, యురేని యం తవ్వకాలపై రెండు సభల్లో తీర్మానం ఆమోదం పొందిందని వివరించారు. సీఎం, మంత్రులు 27 గంటలు అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. టీఆర్ఎస్ సభ్యులు 19 గంటలు, కాంగ్రెస్ సభ్యులు ఏడు గంటలు, టీడీపీ సభ్యుడు 11 నిమిషాలు, మజ్లీస్ సభ్యులు 4 గంటలు మాట్లాడారు. సీఎం కేసీఆర్ 6 గంటలు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క 3 గంటలు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఒక గంట మాట్లాడారు. శాసనమండ లిలో మంత్రులు 7 గంటలు, టీఆర్ఎస్ సభ్యులు 5 గంటలు, ఎంఐఎం సభ్యులు ఒక గంట, కాంగ్రెస్ సభ్యుడు రెండు గంటలు, బీజేపీ సభ్యుడు 51 నిమిషాలు, ఇండిపెండెంట్ సభ్యుడు 35 నిమిషాలు, నామినేటెడ్ సభ్యుడు 28 నిమిషాలు మాట్లాడారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గంట, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రెండు గంటలు, బీజేపీ ఫ్లోర్ లీడర్ 51 నిమిషాలు మాట్లాడారని మంత్రి తెలిపారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశాలు లభించాయని చెప్పారు. సింగరేణి కార్మికులకు లాబాల్లో 28 శాతం వాటాను సీఎం కెసిఆర్ సభలో ప్రకటించారని, శాసన మండలి చైర్మెన్గా గుత్తా సుఖేందర్రెడ్డిని ఈ సమావేశాల్లోనే ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. శాసనసభా కమిటీల్లో ప్రతిపక్షసభ్యులకు సీఎం కెసిఆర్ సూచన మేరకు చోటు లభించిందన్నారు. సమావేశాలు ముగిసినా కాంగ్రెస్ సభ్యుల తీరులో మార్పు రాలేదని విమర్శించారు.