Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గు రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని 'తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. డిన్ఇన్వెస్ట్మెంటు పేరుతో 33 శాతాన్ని ప్రయివేటు రంగానికి అంటకట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను పెంచేసిందని విమర్శించింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి కృష్ణమూర్తి, ఎంఎన్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు బావులలో అధునాతమైన పరికరాలతో తవ్వకాలు జరుపుతున్న తరుణంలో విదేశీ పెట్టుబడుల అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిలో ప్రయివేటు పెట్టుబడిదార్లు గణనీయంగా పెట్టుబడులు పెట్టారని తెలిపారు. సహజ వనరులను వర్తమాన దృష్టితో కాకుండా, భావితరాలకు మిగిలేవిధంగా శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడాన్ని ఖండించారు. బొగ్గు పరిశ్రమల్లో 2.80 లక్షల మంది రెగ్యులర్ కార్మికులు, 3.50 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్నారనీ, వీరితో పాటు మరో 3.50 లక్షల మంది పెన్షన్దార్లు ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో పెన్షనర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బొగ్గు పరిశ్రమల్లో అధిగభాగం ప్రభుత్వ రంగంలో ఉందనీ, సంక్షేమ వసతులు, ఎన్సీఎస్టీలు ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని విజ్ఞప్తి చేశారు. విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా సీఐటీయూ, ఏఐటీయూసీ లాంటి కార్మిక సంఘాలు సమ్మె చేడానికి ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. బొగ్గు రంగంలోని పెన్షనర్ల సమ్మెకు టీఏపీఆర్సీఏ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఈ నెల 24 న సింగరేణి ప్రాంతాలతో పాటు సీఎండీ కార్యాలయం ముందు నిర్వహించే ప్రదర్శనలు, ఊరేగింపులో పాల్గొని సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. బొగ్గు రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.