Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సైరా.. నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి
హైదరాబాద్: 'మన తెలుగు సినిమాకి, తెలుగువాళ్ళకి గౌరవం తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఒకప్పుడు 'శంకరాభరణం', ఆ తర్వాత 'బాహుబలి' చిత్రాలు గౌరవాన్ని తెచ్చాయి. అలా ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెలుగువాళ్ళే కాదు, భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది' అని చిరంజీవి అన్నారు.
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'సైరా..నరసింహారెడ్డి'. చిరంజీవి సరసన నయనతార నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా ప్రధాన పాత్రధారుల్ని పోషించారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుక ఆద్యంతం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'సెప్టెంబర్ 22ని నా జీవితంలో మర్చిపోలేను. 1978 సెప్టెంబర్ 22న నా మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' విడుదలైంది. ఆ రోజు ఎంత టెన్షన్గా ఉన్నానో, అదే టెన్షన్ 41 ఏండ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుగుతుంది. దానికి కారణం 'సైరా'. స్వాతంత్య్ర సమరయోధుడిపై కెరీర్లో నిలిచిపోయే సినిమా చేయాలని ఎప్పుడూ ఉండేది. భగత్ సింగ్పై చేయాలనుకున్నా. కానీ ఎవరూ ఆ కథని తీసుకురాలేదు. దీంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది. పుష్కర కాలం తర్వాత పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. బ్రిటీష్ వాళ్ళపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడని చెప్పారు. చరిత్రలో కనుమరుగైన యోధుడి కథ. కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. ఆ మహాయోధుడి కథని సినిమా రూపంలో యావత్ ప్రపంచానికి చెప్పాలని సంకల్పించాం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఇంతటి బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు చేయడానికి ప్రధాన కారణం రాజమౌళి. ఆయన చేసిన 'బాహుబలి'తో తెలుగు సినిమాకి అంతర్జాతీయంగా దారులు వేశారు. 'బాహుబలి' తీయకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. పరోక్షంగా మాకు ఓ భరోసాని, ధైర్యాన్నిచ్చారు. సినిమా నిర్మించేందుకు చరణ్ రెడీ అనే సరికి నేను సై అన్నాను.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'అన్నయ్య ఫంక్షన్కి నేను ఓ అభిమానిగానే వస్తాను. ఫ్యాన్గా నా గుండెని పంచుకుంటాను. అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఆయన కోసం ఇండిస్టీ అందరు రావాలి. ఇంటర్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు అన్నయ్య ఇచ్చిన ధైర్యం, గుండెబలం వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాంటి అన్నయ్య ఉంటే తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలుండేవి కావు. మద్రాస్లో ఉన్నప్పుడు దేశం గర్వించే స్థాయి సినిమా చేయాలని కోరుకున్నాను. నేను చేయలేకపోయినా చరణ్ ఆ కోరిక నెరవేర్చడం ఆనందంగా ఉంది.
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, 'ఇంతటి చరిత్రాత్మక సినిమా వేడుకకి కారణమైన పరుచూరి బ్రదర్స్ని అభినందించాలి. కొన్ని ఏండ్ల పాటు వాళ్ళు ఈ కథని తమ గుండెల్లో మోశారు. చరణ్ ఇది వాళ్ళ నాన్నకోసం ఇస్తున్న గిఫ్ట్ మాత్రమే కాదు, తెలుగు వారందరికి ఇస్తున్న గిఫ్ట్. దాదాపు 3800 వీఎఫ్ఎక్స్ షాట్తో ఎమోషన్స్ మిస్ కాకుండా తీయడం అంత ఈజీ కాదు. అని తెలిపారు.
నిర్మాత రామ్చరణ్ చెబుతూ, 'సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు' అని చెప్పారు. చిత్ర దర్శకుడు సురేందర్రెడ్డి, జగపతిబాబు, వరుణ్ తేజ్, సాయితేజ్, సురేఖ, ఉపాసన, సుష్మిత, అమిత్ త్రివేది, జెమినీ కిరణ్, పరుచూరి వెంకటేశ్వరరావు, సాయిమాధవ్ బుర్రా, అల్లు అరవింద్, బి.వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రామ్లక్ష్మణ్ మాస్టర్, పృథ్వీ, కెమెరామెన్ రత్నవేలు, డి.వి.వి. దానయ్య, ఎన్వీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.