Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ బహిరంగ సభలు
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాసనసభ సమావేశాలను టీఆర్ఎస్ తమ పార్టీ బహిరంగ సభల మాదిరిగా నిర్వహించిందని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, సండ్ర వెంకట వీరయ్యతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పలేకపోయిందన్నారు. 2014, 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తీర్చేందుకనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు, 57 ఏండ్లకే వృద్ధాప్య పెన్షన్ వయస్సు కుదింపుపై కనీసం మాట్లాడలేదన్నారు. ఇరిగేషన్పై రూ.50వేల కోట్ల నిధులు ఖర్చు చేసి నీళ్లు రాకుండానే వస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందన్నారు. సీతారామా, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సంబంధించిన అప్పులను కార్పొ రేషన్ల ద్వారా తీసుకొచ్చి బాకీ చేయలేదని చూపిస్తోందన్నారు. ఈ ఏడాదిలో అప్పులకు సంబంధించిన వడ్డీ రూ.23 వేల కోట్లుంటే తాజాగా కేసీఆర్ ప్రభు త్వం చేసిన అప్పు రూ.32వేల కోట్లన్నారు. అప్పుల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు పెనుభారం కానుందన్నారు. సమీకరణ కోసం కాంట్రాక్టర్లు ముందస్తుగా పొందిన అడ్వాన్స్లను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులే ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు : శ్రీధర్బాబు
రాష్ట్రం ఆవిర్భవించిన నుంచీ నేటిదాకా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4లతో పాటు డీఎస్సీ కూడా నిర్వహించలేదని శ్రీధర్బాబు ఆరోపించారు. గ్రూప్-2 ద్వారా కేవలం 2009 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాన్ని కల్పించారన్నారు. డిపార్ట్మెంట్ల ద్వారా పదివేల మందికి మాత్రమే ఉద్యోగాన్నిచ్చారన్నారు. న్యాయవాదుల అంశం, సెక్షన్ 11ఎ సీఆర్పీసీ దుర్వినియోగంపై సమాధానం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే నేటికీ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారన్నారు.
కేసీఆర్ను పొగిడేందుకు పోటీ : సీతక్క
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను, ప్రభుత్వ పథకాలను పొగడటానికి మాత్రమే సమయం సరిపోయిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మొత్తానికి అసెంబ్లీలో మందబాలాన్ని చూపించి ప్రతిపక్షాల గొంతునొక్కి వాదించారన్నారు. గిట్టుబాటు ధర గురించి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. బతుకమ్మ చీరతో పాటు తొమ్మిది సరుకులను ప్రభుత్వం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు, జర్నలిస్టుల సమస్యలకు నేటికీ పరిష్కారం దొరకలేదన్నారు.
సింగరేణికి కార్మికులకు బోనస్ హర్షణీయం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇవ్వటం సంతోషకరమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.చందర్ అన్నారు. మీడియా పాయింట్ వద్ద ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మాట్లాడారు. రామగుండంను ఆంధ్రాపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. సింగరేణి ప్రాంతంలో కట్టుకున్న ఇండ్లకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వనుందన్నారు. రామగుండం యూరియా ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించనున్న నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాయచేసి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారని కొందరు అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.