Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేని నిరుద్యోగం
- 'మేకిన్ ఇండియా' ఏమైంది?: నవతెలంగాణ ఎడిటర్ ఎస్. వీరయ్య
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ఐదేండ్ల పాలనలో అస్తవ్యస్త ఆర్థిక విధానాల ఫలితమే ప్రస్తుత మాంద్యానికి కారణమని నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ ఎస్.వీరయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ 24వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక మాంద్యం ఆందోళనకు గురిచేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ.2లక్షల కోట్లు నజరానాగా ఇచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయన్నారు. అంబానీ, అదానీలకు ఇచ్చిన రాయితీలను ప్రజల వైపు మళ్లిస్తే మాంద్యం తగ్గుతుందని సూచించారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్న సమయంలోనే 45 ఏండ్లలో ఎన్నడూలేని స్థాయికి నిరుద్యోగ సూచీ చేరిందన్నారు. మేక్ ఇన్ ఇండియా ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల్లో అత్యధికులు నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. ఉద్యోగాల కల్పన, కనీస వేతనం రూ. 18 వేలు ఇప్పించే దిశగా చర్యలు చేపడితేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి మాంద్యం తగ్గుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఒకే రకమైన రేషన్ కార్డు విధానం ప్రవేశపెట్టడం ద్వారా ధరలు తగ్గుతాయన్నారు. 20 ఏండ్ల క్రితం అర్జెంటీనాలో నెలకొన్న మాంద్యంతో అక్కడి ప్రజలు దుకాణాలను కొల్లగొట్టిన సందర్భాన్ని గుర్తుచేశారు. అలాంటి సందర్భాన్ని కొంతమేర నోట్ల రద్దుతో చూశామన్నారు. మాంద్యం మరింత పెరిగితే ఇక్కడా అర్జెంటీనా ఘటనలు తలెత్తే అవకాశం లేకపోలేదన్నారు. రూ.16వేలకోట్లు ఎగ్గొట్టిన విజరు మాల్యా విదేశాలకు పారిపోవడం, రూ.12వేల కోట్లు కొల్లగొట్టిన నీరవ్మోదీ వెనుక కేంద్రం హస్తం లేకపోలేదన్నారు. కాశ్మీర్లో అంబానీ తిష్టవేసేందుకే 35ఏ రద్దు చేశారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేనివారే దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి తరుణంలో పాలకుల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. డివిజన్ యూనియన్ అధ్యక్షుడు వి.రాజేందర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్సీజెడ్ఐఈఎఫ్ ప్రధాన కార్యదర్శి క్లెమెంట్దాస్, అధ్యక్షుడు కె.వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు మెహబూబ్, యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడారు.