Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి రాలేదు: టీఆర్ఎస్ నేత కేకే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని టీఆర్ఎస్ రాజ్యసభ పక్షనేత కే.కేశవరావు తెలిపారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో కేకే విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల మధ్య చర్చలు జరగాలని కోరారు. కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని అన్నారు. సమ్మెతో పరిస్థితులు చేజారిపోతున్నాయనే అనుమానం తనకు వచ్చిందన్నారు. ప్రెస్ రిలీజ్కు ముందుగానీ, ఆ తర్వాతగానీ సీఎంతో తాను మాట్లాడలేదని తెలిపారు. తన స్టేట్మెంట్తో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయని చెప్పారు. వారితో తాను చర్చలు జరుపుతానని అనలేదనీ, కార్మికులకు మంచి జరుగుతుందంటే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాననీ తెలిపారు. సీఎం ఆదేశిస్తే మాత్రం కచ్చితంగా చర్చలకు దిగుతానని అన్నారు. ఇది పార్టీ సమస్య కాదనీ, ప్రభుత్వ సమస్యనీ వివరించారు. చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతీ రాలేదన్నారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసి కట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. తాను సోషలిస్టుననీ, రాజ్యం వైపు ఎప్పుడూ ఉండననీ, కార్మికుల పక్షం వైపు ఉంటాననీ అన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఒకవేళ విలీనం చేస్తానంటే తనకెలాంటి అభ్యంతరమూ ఉండబోదన్నారు. ప్రభుత్వ ఉద్దేశం తనకు తెలియదనీ, తెలిస్తే సమస్యకు పరిష్కారం దొరికేదనీ కేకే వ్యాఖ్యానించారు.