Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ సమ్మెపై సర్కారు గుస్సా
- సకల జనుల సమ్మెలో ఉద్యోగుల్లో ఐక్యత
- కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు
- నేడు ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత
- వ్యూహాత్మకంగా చీలికలు తెచ్చిన ప్రభుత్వం
ఆంగ్లేయులు విభజించు..పాలించు అన్న సూత్రాన్ని పాటించేవారని చరిత్ర చెబుతున్నది. ప్రభువులపై జనం తిరుగుబావుటా ఎగురవేయకుండా అలాంటి ఎత్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెతో తెరపైకి తెచ్చారనే వాదన వినిపిస్తున్నది.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాధనకు వందలాది మంది బలిదానాలు చేసుకున్నాక తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది. ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్..ఇపుడు సీఎం అయ్యాక మారిపోయారనే చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తమ హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారం కలుగుతుందను కుంటే..సీన్ రివర్స్ అయింది. సర్కారు బెదిరింపులతో.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా లైట్గా తీసుకుంటున్నదనే ఆగ్రహం ఆర్టీసీ కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. మరోవైపు 'ఇదేనా మేం కోరుకున్న తెలంగాణ... ఇందు కోసమేనా ప్రత్యేక రాష్ట్రం సాధించింది'అని ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనర్లు ఆవేదన చెందుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనర్లు ఐక్యతను ప్రదర్శించారు. 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మెలో అందరూ ఒక్కటిగానే పాల్గొని విజయవంతం చేసిన విషయం విదితమే. ఆ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు. 'ఆర్టీసీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన రాష్ట్రంలో కార్మికులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లా పరిగణిస్తాం. ఆర్టీసీని పరిరక్షిస్తాం'అని కేసీఆర్ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాటమార్చ డంపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన, అసహనం పెల్లుబుకుతున్నది. తెలంగాణ వస్తే అడగకుండానే అంటే ఉద్యమాలు చేయకుండానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. కానీ ఆ కలలు కల్లలుగానే మిగిలాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రసక్తే లేదని, చర్చలు జరిపేది లేదని ఇప్పుడు తేల్చిచెప్తున్నారు. ఉద్యమాలకు దిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది.
వ్యూహాత్మకంగా ఉద్యోగుల్లో చీలిక
ఆర్టీసీ సమ్మెకు ముందు నుంచే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉద్యోగ సంఘాల మధ్య చీలికలు తెచ్చింది. అవినీతి పేరుతో రెవెన్యూ ఉద్యోగులు, ఆ సంఘాలను సర్కార్ భయభ్రాంతులకు గురిచేసింది. టీఎన్జీవోలు, టీజీవోలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండేలా స్కెచ్ వేసింది. ఇటీవలే టీఎన్జీవో, టీజీవో నేతలను ప్రగతిభవన్కు పిలిపించి మరీ ఈనెల 21న హుజూర్నగర్ ఉప ఎన్నికల తర్వాత ఉద్యోగుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. ఇలా ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం అనైక్యతను సృష్టించిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ స్వప్నం కోసం ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిగా ఉద్యమిస్తే... ఇప్పుడు హక్కుల సాధనలో ఎందుకు ఐక్యం కాలేకపోతున్నాయన్న ప్రశ్న ఉద్యోగుల నుంచి వస్తున్నది. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విజయవంతమైతేనే హక్కులకు భవిష్యత్తులో రక్షణ ఉంటుందనే చర్చ ఉద్యోగవర్గాల్లో వినిపిస్తున్నది.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయనే భావన కూడా వారిలో వ్యక్తమవుతున్నది. ఐఆర్ లేదంటే పీఆర్సీ అమలు కావాలన్నా, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెరగాలన్నా ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యతను ప్రదర్శించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు అండగా నిలబడాలి. ఆర్టీసీ సమ్మె విచ్ఛిన్నమైతే ఉద్యోగుల మనుగడకే ప్రమాదం దాపురిస్తుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామిక హక్కులకు భంగం కలుగుతుంది. అందుకే ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉద్యోగులందరితో పాటు సంఘాలపైనా ఉన్నదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై.. 11 రోజులైనా టీఎన్జీవో సమ్మెకు మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో నాయకులతో భేటీ అయ్యారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి రావడం గమనార్హం. ఆర్టీసీకి పెరుగుతున్న మద్దతు కారణంగా ఎట్టకేలకు సర్కారుకు వణుకు మొదలైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు.