Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 మందికి గాయాలు
- సెలవుల్లో పత్తి ఏరేందుకు వెళ్తూ గాయపడిన విద్యార్థులు
నవతెలంగాణ-దేవరకొండ
పత్తిచేలో కూలి పనులకు టాటా ఏసీ వాహనంలో వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడి 28 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం చిన్నమునిగల్ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన 40 మంది కూలీలు పత్తి ఏరేందుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరేడుగొమ్మ మండలం కొత్తపల్లికి టాటా ఏసీ వాహనంలో బయలుదేరారు. చిన్నమునిగల్ స్టేజీ సమీపంలోకి రాగానే వాహనం ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. కూలీలంతా రోడ్డుకిరువైపులా చెల్లా చెదురుగా పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే కొందరిని తమ సొంత వాహనాలపై ఆస్పత్రికి తరలించారు. మరికొందరిని 108లో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకుపోయారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 40 మందిలో ఐదుగురు విద్యార్థులు సహా 28 మంది గాయపడ్డారు. ఇందులో పది మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొంత మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో గువ్వలగుట్టకు చెందిన ఐదుగురు విద్యార్థులు పత్తి ఏరేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడుగొమ్ము ఎస్ఐ ఎమ్.రవీందర్ తెలిపారు.