Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి:సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్. సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది హెచ్ఏఎల్ సంస్థల్లో కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ యూనియన్ పూర్తి మద్దతు ఉంటుందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ భరోసానిచ్చారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఏరోనాటికల్ హిందూస్తాన్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... సమ్మెకు మద్దతు తెలిపారు. 2017 నుంచి వేతన ఒప్పందంపై పలు దఫాలుగా చర్చించినా యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడం దారుణమన్నారు. గత్యంతరం లేకనే హెచ్ఏఎల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. హెచ్ఏఎల్లోని అధికారులకు 15 శాతం ఫిట్మెంట్, 53 శాతం పెర్క్సే ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు 11 సార్లు మీటింగ్లు అయినా 11 శాతమే ఆఫర్ ఇచ్చిందని విమర్శించారు. అధికారులతో సమానంగా తమకు వేతనాలు పెంచాలన్న డిమాండ్తో 20 వేల మంది కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. హెచ్ఏఎల్ కార్మికుల వేతనాల సమస్య ప్రభుత్వ విధానాలతో ముడిపడి వుందనీ, అందుకనే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హెచ్ఏఎల్ కార్మికులకు అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమల్లో జరిగిన పద్ధతిలోనే వేతన ఒప్పందం చేయాలని యూనియన్లు కోరుతున్నప్పటికీ యాజమాన్యాల మొండితనం సమ్మెకు దారితీసిందని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేయగల సామర్థ్యమున్న హెచ్ఏఎల్ పరిశ్రమలో వివాదాలు సృష్టించి దానిని నాశనం చేయాలన్న దుర్బిద్ధిలో కేంద్రం ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం హెచ్ఏఎల్ యాజమాన్యానికి సరైన సూచనలు ఇచ్చి వేతన ఒప్పందం త్వరగా జరిగేటట్టు చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు మోడీ సర్కార్ సిద్ధమవుతున్నవేళ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్ఏఎల్ కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ జిల్లా నాయకులు సత్యం, తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఏఎల్ కార్మికుల సమ్మెను వెంటనే పరిష్కరించాలి : వీఎస్ బోస్
హెచ్ఎఎల్ కార్మికుల సమ్మెను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో హెచ్ఏఎల్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. బెంగుళూరులోని హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయంలో కార్మిక సంఘాలు అనేక దఫాలుగా వేతన పెంపుదల ఒప్పందంపై చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలపై సరైన విధానం లేకపోవటం మూలంగా అనేక పరిశ్రమల్లో అశాంతి నెలకొందన్నారు. సమ్మె పరిష్కారంలో జాప్యం వల్ల హెచ్ఏఎల్ పరిశ్రమకు జరిగే నష్టానికి కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యాలే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.