Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ తీరుపై యువజన సంఘాల ఆగ్రహం
- ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బస్భవన్ ముట్టడి
- నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- ఈడ్చుకెళ్లడంతో డీవైఎఫ్ఐ నేతలకు గాయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ, సమ్మెను నివారించాలనీ కోరుతూ యువజన సంఘాలు మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్)కు చెందిన వందలాది మంది యువకులు బస్భవన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించడంతో వారిని అడ్డుకున్నారు. యువజన సంఘాల నాయకులు నిరసన తెలిపారు. బస్భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యువజన సంఘాల నాయకులను పోలీసులు రోడ్డుమీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ సమయంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజశేఖర్కు గాయాలయ్యాయి. రక్తం వచ్చేలా రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లడంతో విప్లవ్కుమార్ చెయ్యికి గాయమైంది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ విజరుకుమార్ మాట్లాడుతూ పోలీసులు నిరంకుశంగా వ్యవహరించడం వల్ల గాయాలయ్యాయని చెప్పారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డగోలుగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రుల వ్యాఖ్యాల వల్లే వారు చనిపోయారని అన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగులను తొలగించామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. 48 వేల మంది సెల్ఫ్డిస్మిస్ అయ్యారని చెప్పడం సరైంది కాదన్నారు. సీఎం కుటుంబ అనుచరులకు ఆర్టీసీని కట్టబెట్టేందుకే ప్రయివేటీకరిస్తున్నారని విమర్శించారు. వెంటనే ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలనీ, నేతలతో చర్చలు జరపాలనీ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ నాయకులు టి మహేందర్, రాజశేఖర్, కృష్ణానాయక్, బల్రామ్, ఆంజనేయులు, కిరణ్, సాయి, శశాంక్, నగేష్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. బస్భవన్ ముట్టడికి వచ్చిన పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ప్రదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రయివేటీకరణ కోసమే : అనిల్
ఆర్టీసీ ప్రయివేటీకరణ కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అనిల్కుమార్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీ ఉపయోగిస్తున్న డీజిల్కు వ్యాట్ నుంచి మినహాయించాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 19న రాష్ట్రబంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏఐవైఎఫ్ నాయకులు కె శంకర్, ఎన్ శ్రీకాంత్, టి సత్యప్రసాద్, షేక్నదీం, ఆర్ బాలకృష్ణ, కె ధర్మేంద్ర, ఎండి మహమ్మద్, మాజిద్, హసత్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.