Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు
- జేబీఎస్లో సమ్మెకు మద్దతు
నవతెలంగాణ-సికింద్రాబాద్
ఆర్టీసీ సంస్థ కాదు.. ఒక వ్యవస్థ అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ జేబీఎస్ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పట్టించకుండా గడీలో కూర్చుని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పత్రికలన్నీ కార్మికుల గురించి రాస్తే కేసీఆర్ పత్రిక మాత్రం అందుకు భిన్నంగా రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త బస్సులు కొనకుండా.. కాలం చెల్లిన బస్సులనే నడిపిస్త్తూ ప్రమాదాలు జరిగితే మాత్రం ఆ నెపం కార్మికుల మీద వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రయివేటుకు అప్పజెప్పాలని చూస్తోందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, సీఐటీయూ నాయకులు ఈశ్వర్రావు, అజరుబాబు, సత్యనారాయణ, వివిధ పార్టీల నాయకులు, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.