Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటే సీఎంతో భేటీ ఏంటి?
- ఉద్యోగ సంఘాల నేతలకు రేవంత్రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఒకవైపు ఆర్టీసీ కార్మికుల ఉద్యమం...మరోవైపు కార్మికులు ఆత్మహత్యలు...ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో ఉద్యోగ సంఘాల నేతలకు ముద్దెట్ట దిగిందనే అనుమానం కలుగుతున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మిమ్మల్ని కలవడం వెనుక అంతరార్థం ఏమిటని నిలదీశారు. 'ప్రగతిభవన్లో మీ ఇంటి కుక్క చనిపోతే ఏఫ్ఐఆర్ నమోదు చేస్తారు. డాక్టర్ను సస్పెండ్ చేస్తారు. ఆర్టీసీ కార్మికులు అభద్రతాభావంతో చనిపోతుంటే మరి చర్చలకు ఎందుకు పిల్వరు' అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు ముందు టీఎంయూ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా మంత్రి తన్నీరు హరీశ్రావు ఉన్నారనీ, వారి సమస్యలు తెలిసినా కూడా ఎందుకు ఆయన స్పందించడం లేదో చెప్పాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ అనడం ఆయన అవగాహనారహిత్యానికి నిదర్శనమనీ, రాజ్యాంగంలో ఆ పదం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కార్మికులను తొలగిస్తామనీ, కొత్త వారిని ఉద్యోగాల్లో నియమిస్తామని సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులతో పెత్తనం చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ బేషజాలకు పోకుండా కార్మికులతో చర్చలు నిర్వహించాలన్నారు. 19 లోపు సమస్యలను పరిష్కరించకపోతే 21న ప్రగతిభవన్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సైకిల్ తొక్కారని బస్సులిచ్చి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు తన లేఖలో పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ ఖండిస్తున్నదని దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు సైతం ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. a