Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసుల అడ్డగింపు
- డీఎస్పీ కారుపై రాయిరువ్విన గుర్తుతెలియని వ్యక్తి
- కార్మికున్ని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రతినిధి
రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటిని ముట్టడించేందుకు మంగళవారం సంగారెడ్డి నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు మద్దతుగా 600మందితో వెళ్లి మంత్రి ఇంటిని ముట్టడిస్తానంటూ జగ్గారెడ్డి సోమవారం ప్రకటించారు. అన్నట్టుగానే మంగళవారం సంగారెడ్డి డిపో ఎదుట కార్మికుల ధర్నాలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే బస్టాండ్ వద్ద డీఎస్పీ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో భారీగా మోహరించిన పోలీసులు జగ్గారెడ్డిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో ఓ వ్యక్తి డీఎస్పీ శ్రీధర్రెడ్డి కారుపై రాయి రువ్వాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు జగ్గారెడ్డిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. డీఎస్పీ కారుపై రాయి రువ్వింది ఇస్మాయిల్ అనే కార్మికుడేనని అనుమానించిన పోలీసులు అతన్ని అరెస్టుచేసి పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.