Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైవే రహదారుల వెంట విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో డెయిరీ ఉత్పత్తులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో విజయ డెయిరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయివేట్ డెయిరీల ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా విజయ డెయిరీ ఉత్పత్తుల ధరలపై బోర్డు నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ నెయ్యి మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమక్క, సారక్క జాతరలో సుమారు 150 మొబైల్ ఔట్లెట్ల ద్వారా విక్రయించాలని కోరారు. సినిమా థియేటర్లు, సోషల్ మీడియా, టీవీ లలో ప్రచారం చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ సందీప్ కుమార్ సుల్తానియా, డెయిరీ చైర్మెన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.