Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెతో సర్కారులో పెరుగుతున్న అసహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రగతిభవన్లో ఎటు చూసినా నైరాశ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ సహచరుల్లోనూ ఇది వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతున్న కొద్దీ సర్కారులో అసహనం పాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సమ్మెను మొదట్లో తక్కువగా అంచనా వేసిన ముఖ్యమంత్రి... 'గడప దాటిన వాళ్లు గడప బయటే.. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోబోం, ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదు, సమ్మెలో ఉన్న వారితో చర్చలు జరిపే ఆలోచనే లేదు...' అంటూ వరస ప్రకటనలు గుప్పించారు. సీఎం స్థాయిలో ఆయన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా.. కార్మికులు ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు. పైగా రోజురోజుకీ ఆందోళన తీవ్రతరమవుతున్నది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ఆగటంలేదు. వారి కుటుం బాలను ఓదార్చి, ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు.. ఆ వైపు దృష్టి సారించటంలేదు. పైగా ఇంటిపెద్ద చనిపోవటంతో.. నిలువనీడ కోల్పోయిన కుటుంబసభ్యుల్ని అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని మరింత రెచ్చగొడుతున్నదనే వాదన కార్మికవర్గాల్లో వినిపిస్తున్నది. సర్కార్ చర్య సామాన్య ప్రజలకూ మింగుడుపడటంలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఊహించని ఈ పరిణామాలతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిర వుతున్నారు. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఏ ఒక్క కార్మికుడు లేదా ఉద్యోగి అయినా రెచ్చిపోయి ఆర్టీసీ బస్సులకు, సంస్థ ఆస్తులకు నష్టం కలిగించినా, విధ్వంసం సృష్టించినా ఆ పేరుతో జేఏసీలోని పెద్ద నాయకులందరిపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నది సర్కారు వ్యూహంలా కనిపిస్తున్నదని ఆర్టీసీ కార్మికనేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా కార్మికులపై ఉక్కుపాదం మోపి సమ్మెను నీరు గార్చేయోచనలో ఉన్నదన్న అనుమానాలు వ్యకం చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, ఉద్యోగుల సమన్వయం, సంయమనంతో వ్యవహరిస్తుండటంతో సర్కారు పన్నాగం కాస్త బెడిసి కొట్టింది.
దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. పోనీ.. టీవీ చర్చాగోష్టుల్లోనైనా విపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నేతల విమర్శలను ధీటుగా ఎదుర్కొందామంటే.. అక్కడా చుక్కెదురే అవుతున్నది. 'టీఆర్ఎస్కు చెందిన లీడర్లెవరూ టీవీ చర్చల్లో పాల్గొనవద్దు..' అంటూ మూణ్నెల్ల కిందట అధినేత హుకుం జారీ చేసిన విషయం విదితమే. దీంతో గులాబీ నేతలెవరూ టీవీ స్టూడియోల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వివిధ చానళ్లలో వార్ వన్సైడ్గా నడుస్తున్నది. ఈ క్రమంలోనే సీఎంతో సహా క్యాబినెట్ సభ్యులు..ఉన్నతాధికారులు, గులాబీ శ్రేణులు ఒత్తిడికి గురవుతున్నట్టు స్పష్టమవుతున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.