Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు నెలల సుదీర్ఘ పోరాటంతో పున:ప్రారంభం
- స్థానికుల హర్షం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏడు నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత సింగరేణి ప్యాసింజర్ రైలు తిరిగి పట్టాలెక్కింది. మంచి ఆదాయంతో ఎలాంటి ఒడిదు డుకులు లేకుండా నడుస్తున్న ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏవేవో కారణాలు చూపించి ఏడు నెలల కిందట రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. రైలును తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కొత్తగూడెం స్టేషన్ మాస్టర్కు పలుమార్లు వినతిపత్రం అందజేసినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి రైలు తిరిగి ప్రారం భమయ్యేలా చూడాలంటూ ఒత్తిడి తెచ్చారు. ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరకు
కొత్తగూడెంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు జేఏసీగా ఏర్పడి ఐదారు నెలల పాటు దీక్షలు, ఐక్య ఉద్యమాలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన రైల్వే అధికా రులు సింగరేణి ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించడానికి గ్రీన్ సిగల్ ఇచ్చా రు. కొత్తగూడెం-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రైలు పట్టాలపై ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పర్యవేక్షించారు. ఈ నెల 6వ తేదీ నుంచే భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు సింగరేణి ప్యాసింజర్ రైలును నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో నడిచిన విధంగానే 14 కోచ్లతో ఈ రైలు యథావిధిగా నడుస్తోంది. సమయ పాలనలో ఎలాంటి మార్పులూ చేయకుండా పాత పట్టిక ప్రకారమే నడిపిస్తు న్నారు. దాదాపు 60 ఏండ్ల చరిత్ర ఉన్న రైలును వ్యయం తగ్గించే కార్యాచరణలో భాగంగా ఏడు నెలల కిందట రద్దు చేశారు. దీని స్థానంలో పుష్ఫుల్ రైలును ప్రారంభించారు. అయితే, సింగరేణి రైలు తిరిగి ప్రారంభం కావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కువగా సింగరేణి కార్మిక కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతుల కుటుంబాలు, ప్రభుత్వం, ప్రయివేటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రయాణం చేస్తుంటారు.