Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్కు రాఘవులు హెచ్చరిక
- నిరంకుశంగా వ్యవహరిస్తే చంద్రబాబుకు పట్టిన గతే
- సమ్మె కార్మికుల ప్రజాస్వామిక హక్కు
- ప్రయివేటీకరించే దురుద్దేశంతోనే ఉక్కుపాదం
- లేదంటే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి
- భూస్వామ్య వైఖరిని వీడి చర్చించాలి : తమ్మినేని
- మోడీ విధానాలపై నేడు దేశవ్యాప్త నిరసనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులపై కెనడా ఫార్ములా పాటిస్తే టీఆర్ఎస్ సర్కారు మట్టికొట్టుకుపోతుందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు తరహాలో ఉక్కుపాదం మోపడం సరైంది కాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె కార్మికుల హక్కు అని చెప్పారు. కేసీఆర్ మొండివైఖరి విడనాడకపోతే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని అన్నారు. మంగళ వారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మద్దతు ప్రకటించిందన్నారు. నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకపోవడం ప్రజాస్వామిక దేశంలో తప్పుడు పద్ధతి అని విమర్శించారు. కార్మికులను శత్రువు లుగా భావించి కర్కషంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. కెనడా మోడల్ను పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తు న్నారని చెప్పారు. కెనడా మోడల్ను అమలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మట్టికొట్టుకుపోయింద న్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు అదే తరహాలో అణచివేశారని
గుర్తు చేశారు. అణచివేయడం ద్వారా లొంగదీసుకోవాలనే ప్రభుత్వాలు చరిత్రలో నిలబడలేవని గుర్తు చేశారు. న్యాయమైన కోర్కెల కోసం కార్మికులు సమ్మె చేపడితే వారిని పిలిచి మాట్లాడ్డం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సమ్మె విరమించి చర్చలకు రావాలని టీఆర్ఎస్ నేత కె కేశవరావు పిలవడం న్యాయం కాదన్నారు. రాజ్యాంగంలో సమ్మె హక్కుందని చెప్పారు. కార్మికులు బెట్టు చేస్తే తప్పు కాదనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బెట్టు చేయడం తగదనీ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రయివేటీకరించాలనీ, ఆస్తులను ధారాదత్తం చేయాలనీ దురుద్దేశం లేకపోతే వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వానికి దురుద్దేశం ఉంటే ప్రమాదకరమని అన్నారు. ప్రపంచబ్యాంకు ఆదేశాలతో గతంలో చంద్రబాబు, వైఎస్ ఆర్టీసీని ప్రయివేటీకరించాలని చూసినా వామపక్షాల పోరాటాలు, ఆర్టీసీ కార్మికుల ఉద్యమాలు, ప్రజల సహకారంతో నిలువరించామని గుర్తు చేశారు. ప్రజా రవాణా ఎంతో అవసరమన్నారు. ఆర్టీసీ, ఎర్రబస్సు అంటే ప్రజలకు ప్రేమ ఉందని చెప్పారు. ప్రజలు మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారంటే ఆర్టీసీ బస్సులుండడం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్రెడ్డి, సురేందర్గౌడ్ ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని చెప్పారు. పోరాటం ద్వారా ప్రాణత్యాగం చేయాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడొద్దని పిలుపునిచ్చారు. ఆ ఇద్దరివీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నేడు దేశవ్యాప్త నిరసనలు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బుధవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయని రాఘవులు చెప్పారు. ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఆర్థికమాంద్యం ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తోందన్నారు. డబ్బులు ఇవ్వాల్సింది పెట్టుబడిదారులకు కాదని, ప్రజలకు ఇవ్వాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రపంచమంతా చక్కర్లు కొడుతున్నారనీ, మాంద్యం గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదనీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్టికల్ 370, 35(ఏ)ల గురించి ప్రస్తావిస్తున్నారని, మాంద్యం ప్రస్తావన లేదనీ చెప్పారు.
భూస్వామ్య వైఖరిని వీడి చర్చలు జరపాలి : తమ్మినేని
ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈనెల 19న రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్నదని అన్నారు. కార్మికులతోపాటు సూపర్వైజర్లు పాల్గొంటున్న ఈ సమ్మె గొప్పదని వ్యాఖ్యానించారు. కొత్తకోర్కెలు కోరడం లేదనీ, సీఎం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ సమ్మె చేస్తున్నారని అన్నారు. 48 వేల మంది సెల్ఫ్డిస్మిస్ అయ్యారని, సమ్మె చట్టవిరుద్ధమని సీఎం ప్రకటించడం, నిర్భందాలు ప్రయోగించడం వల్లే ఇద్దరు కార్మికులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము వాడుకుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల మృతికి మంత్రులు సంతాపం ప్రకటించడం కాదనీ, వారి కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సోయిలేకుండా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు సమ్మెను రెచ్చగొడుతున్నాయని ప్రకటించడం దారుణమని అన్నారు. బెంగాల్లో 6 శాతం ఉన్న ఆర్టీసీ బస్సులను 66 శాతానికి పెంచిన ఘనత వామపక్ష ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కేరళలో ఏటా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు, 2 శాతం వడ్డీకి రూ.3,500 కోట్లు ఆర్టీసీకి కేటాయిస్తుందని వివరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని అన్నారు. కానీ ఇక్కడ ఆర్టీసీని విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కావాలని కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పారు. బీజేపీతో టీఆర్ఎస్ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నదని అన్నారు. బీజేపీ రైల్వే, ఎయిర్లైన్స్, రక్షణరంగాన్ని ప్రయివేటీకరించినా టీఆర్ఎస్ స్పందించడం లేదన్నారు. కానీ బీజేపీ విధానాలపై వామపక్షాలు పోరాడుతున్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మె విజయవంతం కావాలని వామపక్ష పార్టీలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో మండల, జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థికి సీపీఐ మద్దతు ఇస్తే వామపక్షాలు ఒకటిగా ఉన్నాయని అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, బి వెంకట్ పాల్గొన్నారు.
ఇదీ కెనడా ఫార్ములా...
కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన సుమారు 30 వేల మంది కార్మికులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనే డిమాండ్తో 1919, మే 15క సమ్మెకు దిగారు. ఆరువారాలపాటు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించలేదు. 1919, జూన్ 21న సామూహిక మౌనదీక్షకు దిగారు. వేలాది మంది ఆందోళనల్లోకి వచ్చారు, వారిని చెదరగొట్టేందుకు కెనడా ప్రభుత్వం మిలటరీని రంగంలోకి దింపింది. కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో 1919, జూన్ 25న సమ్మె విరమిస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు. షరతు లతో ఆ కార్మికులు విధుల్లో చేరారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరించిన ప్రభు త్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఘోరంగా ఓటమి పాలైంది. అయితే కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరించిన కెనడా ఫార్మూలాను పాటించాలని సీఎం కేసీఆర్ భావిస్తు న్నారు. సమస్యలను పట్టించుకోకుండా ఉంటే కార్మికులే దిగొచ్చి సమ్మెను విరమిస్తారని అభిప్రాయంతో ఉన్నారు.