Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తాత్రేయ, నాయినిలే సూత్రధారులు
- తిమింగళాలను వదిలి చేపలకు శిక్ష
- అసలు దోషులెంతటి వారైనా వదలొద్దు : సీఐటీయూ ఆధ్వర్యంలో ఈఎస్ఐ డైరెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈఎస్ఐ కార్పొరేషన్లో జరిగిన అవినీతి కుంభకోణంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులే తోడుదొంగలనీ, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనీ, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలంటూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈఎస్ఐ డైరెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది కార్మికులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్లకార్డులు, జెండాలు పట్టుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు మాట్లాడుతూ కుంభ కోణంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ,రాష్ట్ర మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డిలే ప్రధాన సూత్రధారులని అన్నారు. మంత్రులనుంచి మొదలు కొని, ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు ఇందులో పెద్ద తిమింగళాలు ఉన్నాయని తెలిపారు. బడా ఫార్మా కంపెనీలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను తప్పించి కిందిస్థాయి అధికారులను దోషులుగా నిలబెట్టి కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కార్మికుల శ్రమను, రక్తాన్ని దోచుకున్న నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. తవ్విన కొద్ది అక్రమాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లోతుగా ధర్యాప్తు చేయాలని సూచించారు. ఓపెన్ టెండర్ల ద్వారా మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా, నిబంధనలను పక్కన పెట్టిన ఈఎస్ఐ అధికారులు దొంగ ఇండెట్లను సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో 70 ఈఎస్ఐ డిస్పెన్సరీల కోసం గత ఐదేండ్లలో రూ. 1000 కోట్ల మందుల ఫార్మాకంపెనీల నుంచి కోనుగోలు చేశారన్నారు. ఇందులో రాజకీయ నాయకులు, అధికారులు దోచుకున్న రూ. 200 కోట్లను సంస్థకు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 17 లక్షల మంది కార్మికులు, 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా ఆరోగ్య సేవలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఇంత మంది ప్రయోజనాలను కాలరాసిన ప్రభుత్వం ఈఎస్ఐని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కనీస వేతనాలు లేక, పెరిగిన ధరలతో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న కార్మికుల సొమ్ము పక్కదారి పట్టడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, యాజమాన్యాల వాటాధనంతోనే ఆరోగ్య భద్రత, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారే తప్ప ప్రభుత్వం కార్మికులకు ప్రత్యేకంగా చేసిందేమి లేదన్నారు. ఈ కుంభ కోణంలో పెద్ద తలకాయలున్న నేపథ్యంలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ ఈఎస్ఐలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు గతంలో ఉన్న త్రైపాక్షిక కమిటీని పునరుద్ధరించి సీఐటీయూతో పాటు పలు కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, మారుమూల ప్రాంతాలకు విస్తరించేలా మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రును ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు బాస్కర్ మాట్లాడుతూ ఈఎస్ఐలో వందల కోట్లు పక్కదారి పట్టడంతో, కార్మికులకు మందులు, ఇతర పరీక్షలు అందుబాటులో లేకుండా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రులలో అందుబాటులో లేని వైద్య సేవలకుగాను రోగులను కార్పోరేట్ అస్పత్రులకు సిఫారసు చేసేందుకు సైతం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొంది రీయింబర్స్మెంట్ కోసం సైతం కార్మికులు నెలల తరబడి తిరుగుతున్నారని ఆరోపించారు. కొన్ని సందర్భాలలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో కార్యదర్శులు జె.వెంకటేష్, జె.మల్లిఖార్జున్, సంగారెడ్డి జిల్లా నాయకులు బి.మల్లేష్, సాయిలు, పాండురంగారావు, సంతోష్, జె. చంద్రశేఖర్, ఎ.అశోక్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు కె.ఈశ్వర్రావు, హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్, నాగేశ్వర్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం.చంద్రమోహన్, డి.జగదీష్, సిద్దపేట జిల్లా నాయుకులు గణేష్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.