Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్లను క్రియాశీలకంగా మారుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియామకమైన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గటిక అజరు కుమార్ బుధవారం ప్రగతి భవన్ లో ఎంపిపిలు, జడ్పీటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యమంత్రిని కలిశారు. తనను ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించినందుకు సీఎంకు అజరు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు కూడా నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఎంపిపిలు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, జడ్పీ చైర్మన్లతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో మండల, జిల్లా పరిషత్ లకు కూడా నిధులు విడుదల చేస్తామన్నారు.