Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14వ రోజూ పట్టుదలతోనే ఆర్టీసీ కార్మికుల సమ్మె
- నేటి బంద్ విజయవంతం కోసం ర్యాలీలు
- మద్దుతుగా వామపక్ష పార్టీల విస్తృత ప్రచారం
నవతెలంగాణ-యంత్రాంగం
ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం పంతాలకు పోతున్నప్పటికీ కార్మికులు మాత్రం పట్టువిడవడం లేదు. హైకోర్టు సూచనలను కూడా సర్కారు లెక్కచేయకపో వడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం 14వ రోజు సందర్భంగా జిల్లాల్లో బైక్ ర్యాలీలు, అంబేద్కర్ విగ్రహాలకు వినతులు, బతుకమ్మ ఆటలు, బిక్షాటనలతో పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం), వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం బస్ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ, కార్మికుల దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించి సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, బోడా వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులున్నారు. కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండలో నకిరేకల్లో బిక్షాటన చేసి నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా భూదాన్పోచంపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చౌటుప్పల్లో కార్మికుల దీక్షలకు ఎంపీ రేవంత్రెడ్డి సంఘీభావం తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఏకశిలాపార్క్లో దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. సీఐటీయూ, కేవీపీఎస్, గిరిజన సంఘం, ఆల్షాప్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ కార్మిక సంఘం డీవైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండల జాతీయ రహదారిపై గంటపాటు ధర్నా రాస్తారోకో చేపట్టారు. భద్రాచలంలో ఐద్వా ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జగిత్యాలలో మధ్యాహ్నం భోజనం కార్మికులతో బతుకమ్మ ఆటలాడుతూ, బిక్షాటన చేశారు. మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు కారును ఆర్టీసీ బస్సు ఢకొీట్టడంతో నాయకులు ధర్నా చేశారు. నేటి బంద్ను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంథనిలో బైక్ ర్యాలీ చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బైక్ ర్యాలీలు కొనసాగాయి. నిజామాబాద్లో వామపక్ష పార్టీల నాయకులు దుకాణాదారులను, వాణిజ్య సముదాయాల్లో వినతిపత్రం అందజేశారు. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల బిక్షాటన చేశారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్లో డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్దఎత్తున ర్యాలీ చేసి కరీంనగర్-వరంగల్ ప్రధాన రాహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బైక్ ర్యాలీ చేపట్టగా కేవీపీఎస్, సీఐటీయూ, మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, గిరిజనసంఘాలు మద్దతు తెలిపాయి. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వామపక్ష పార్టీలు ధర్నాలు చేపట్టాయి.