Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల ఉసురు
- గడీల పాలనను మరిపిస్తున్న టీఆర్ఎస్ సర్కార్
- 'సకలజనుల భేరి' సభలో అఖిలపక్ష నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కేసీఆర్ నియంతృత్వ పాలనకు చివరి రోజులు దాపురించాయి... ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల ఉసురు తగులుతుంది... గడీల పాలనను మరిపిస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతుతారు... నేడు తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలి' అని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిరంజన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 'సకలజనుల భేరి' సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ రెండు సార్లు అధికారం చేపట్టిన ముఖ్యమంతి కేసీఆర్ పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు. కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ మాట్లాడుతూ కార్మికులతో పెట్టుకున్న ఎందరో మహామహులు చరిత్రలో కలిసి పోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేసీఆర్ది దోపిడీ, అవినీతి కోణమని ఆరోపించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలే గుణపాఠం చెబుతారని జోష్యం చెప్పారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ తన ఆస్తులపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 'మంత్రి హరీశ్రావు మౌనం మంచిది కాదు. పదవులు శాశ్వతం కాదు. కార్మికులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. అవసరం అయితే మళ్లీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం' అని తెలిపారు. కాంగ్రెస్ నేత వి. హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈనెల 23న ఉస్మానియా యూనివర్సీటిలో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధూంధాం పోస్టర్ను ఈ సందర్భంగా నేతలు ఆవిష్కరించారు. ఆర్టీసీ అమరవీరులు శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్గౌడ్ కుటుంబాలకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య, తెలుగదేశం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ రూ. లక్ష, వి.హన్మంతరావు రూ.50వేల చొప్పున ఆర్థిక సహయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, టఫ్ నేత విమలక్క, తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.