Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు
- కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ చట్టవిరుద్ధం
- నవతెలంగాణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి నియంత ముఖ్యమంత్రిని చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన సంఘాలను చర్చలకు ఆహ్వానించి పరిష్కారమయ్యే సమస్యలు, కానివి వివరించే వారని గుర్తు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నియమించేవారని చెప్పారు. కానీ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించేది లేదని ఏకపక్షంగా ప్రకటించడం సరైంది కాదన్నారు. 14 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె పరిణామాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు...
కేసీఆర్ వ్యవహారశైలి గత సీఎంలకు భిన్నంగా ఉందని భావిస్తున్నారా?
గతంలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు. ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రజాప్రతినిధులను కలిసేవారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో చర్చించేవారు. మంత్రివర్గ ఉపసంఘం నియమించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రాతినిధ్యం చేసేందుకు అవకాశం లేదు. వినతిపత్రాలు గిట్టవు. లేదు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతున్నది. గతంలో సీఎంలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే, ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
సమ్మె నోటీసు ఇచ్చినపుడు ప్రభుత్వం ఎలాంటి పద్ధతి పాటించాలి?
సీఎం కేసీఆర్ రెండు తప్పులు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పేరుతో యూనియన్లను పెట్టారు. సింగరేణి, ఆర్టీసీలో సంఘాలు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లను విచ్ఛిన్నం చేశారు. ఇతర యూనియన్లను నిరాకరిస్తున్నారు. కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించాలి. ముందు చర్చలు జరపాలి. కానీ, కార్మిక సంఘాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇస్తే చట్టవిరుద్ధమని అంటున్నారు. ఇది అప్రజాస్వామికం.
కార్మికులు సెల్ఫ్డిస్మిస్ అయ్యారని సీఎం వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?
సెప్టెంబర్లో ఆర్టీసీ కార్మికులు నోటీసు ఇచ్చి ఈనెల 5 నుంచి చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రానందునే తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు. సమ్మె చట్టవిరుద్ధం అన్నపుడు సెల్ఫ్డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధం కాదా?. ఉరివేసేటపుడు ఖైదీలను చివరి కోరిక అడుగుతారు. కానీ ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే అధ్వానంగా వ్యవహరించింది. కానీ సెల్ఫ్డిస్మిస్ చేయడం అప్రజాస్వామికం.
పరిష్కారానికి మీరిచ్చే సూచనలేంటీ?
ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. కార్మికులతో చర్చలు జరపాలి. పట్టుదలకు పోకుండా ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికులు వ్యవహరించాలి. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లలో ఏవీ పరిష్కారమవుతాయో, ఏవి పరిష్కారం కావో వివరించాలని కోరారు.