Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఆర్థిక లావాదేవీల కోసం కాదు.. ప్రజల కోసం
- సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం
- నేటి బంద్ను జయప్రదం చేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- నల్లగొండ ప్రతినిధి
ఆర్టీసీ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమనీ, కేసీఆర్ మొండి వైఖరి వీడి వెంటనే సమ్మెను విరమింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాలను సందర్శించి, సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసీఆర్పై సెక్షన్ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. కార్మికుల పీఎఫ్ మొత్తాన్ని సంబంధిత ఖాతాలకు జమ చేయకపోవడం నేరమన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని సీఎం ప్రశ్నిస్తున్నారనీ, కేరళలో ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ చెల్లిస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేరళ ప్రభుత్వం యేటా 1500 కోట్ల బడ్జెట్ను ఆర్టీసీకి కేటాయిస్తోందన్నారు. కార్మిక సంఘాలను కేసీఆర్ వద్దంటున్నారనీ, హరీశ్రావు, కవిత యూనియన్లకు అధ్యక్షులుగా లేరా అని పశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అక్కరకొచ్చిన కార్మిక సంఘాలు ఇప్పుడెందుకు పనికి రావని నిలదీశారు. రాష్ట్రంలో ఆర్టీసీ వ్యవస్థను నడిపించాల్సింది ఆర్థిక లావాదేవీల కోసం కాదని, ప్రజలకు మెరుగైన రవాణా కోసమని చెప్పారు. కార్మికులు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరిస్తే బంద్ను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వారి స్వప్రయోజనాల కోసం కాదనీ.. యావత్ తెలంగాణ ప్రజానీకం కోసమని అన్నారు. శనివారం జరగనున్న రాష్ట్ర బంద్కు సబ్బండ వర్గాలు మద్దతు తెలిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటీవలే సవరణ చేసిన 2019 ఎంవీ యాక్టును వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ యాక్ట్లో భాగంగా రోడ్లన్నింటినీ ప్రయివేటీకరణ చేయడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. శనివారం బంద్లో ఆర్టీసీ కార్మికులే కాదు అన్ని రవాణా, కార్మిక సంఘాలూ పాల్గొంటాయని తెలిపారు.