Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ నేతే ఉద్యమాల్ని అణచివేస్తారా?
- ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేసే హక్కుంది: సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యమ నేపథ్యం నుంచి సీఎం అయిన కేసీఆర్ నేడు ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమనీ, మనం నిజాం పాలనలో లేమనీ, ప్రజాస్వామ్యయుత పాలనలో ఉన్నామనీ సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎకె .పద్మనాభన్ అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్కు కార్మిక చట్టాల గురించి తెల్వదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఎక్కడా లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఐక్య పోరాటం చేయడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సమ్మె- ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎకె.పద్మనాభన్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించడం తగదన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు మొదలుపెట్టిన సమ్మె నేడు రాష్ట్రంలో అందరి సమ్మెగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు. భారత కార్మిక వర్గానికి వందేండ్ల చరిత్ర ఉందనీ, బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిందనీ గుర్తుచేశారు. సమ్మె పట్ల కేసీఆర్ ప్రభుత్వ వైఖరి సరిగాదన్నారు. సమ్మె సాకుతో ప్రయివేటీకరణ చేయాలని కేసీఆర్ చూస్తున్నారనీ, కేంద్రం సవరించిన ఎంవీ యాక్టులో ఆర్టీసీలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం దాగి ఉందని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను కేసీఆర్ పట్టించుకోకపోవడం తగదని హితవు పలికారు. కేరళలో ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రధాని చెప్పినా వినను, సంఘాలను అనుమతించను అన్న యాజమాన్యం కోర్టు కలుగజేసుకొని సమస్యను పరిష్కరించిందని గుర్తు చేశారు. దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా యనీ, కోల్ వర్కర్స్, డిఫెన్స్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లి విషయాలను వివరించారు. ప్రభుత్వానికి ఉన్న హక్కులు రాజ్యాంగం ప్రకారం కార్మికులకు కూడా ఉంటాయనీ, 48,000 మంది సెల్ఫ్ డిస్మిస్ చెల్లదనే విషయాన్ని దేశం మొత్తం గమనిస్తున్నదనీ, కోర్టు జోక్యం చేసుకుని సరైన పద్ధతిలో కలుగజేసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా బీఎంఎస్ తప్ప అన్ని కేంద్ర, కార్మిక సంఘాలు 2020 జనవరి 8న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెలోకి వెళ్తున్నాయని చెప్పారు. కార్మికులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ, సమస్య పరిష్కారం లభించే వరకూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి మాట్లాడుతూ నేటితో సమ్మె 14వ రోజు కొనసాగుతుందన్నారు. రవాణా రంగం, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెల్పడం కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం ఆగదనీ, ఇప్పటికే అఖిలపక్షం రాష్ట్ర బంద్ పిలుపులో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మొండి ప్రభుత్వం తమ నిరంకుశ చర్యలను వీడి జెఏసితో చర్చించి సమస్య లు పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. సీఐటీ యూ ఉపాధ్య క్షులు ఆర్. సుధాభా స్కర్ అధ్య క్షత వహించగా ఆర్టీసీ జే ఏసీ కో-కన్వీనర్లు రాజిరెడ్డి, వీఎస్.రావు, సుధ ప్రసంగించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఎస్. రమ, రాష్ట్ర కార్యదర్శి బి. మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, యాటాల సోమన్న, పి. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.