Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకల జనులు సమాయత్తం..
- సర్కారు తీరుపై తిరుగుబాటు
- పోలీస్ పహారాలో బస్సుల్ని తిప్పండి : సీఎం కేసీఆర్
- చర్చలకు ఆహ్వానించని ప్రభుత్వం
- 14వ రోజూ కొనసాగిన ఆందోళనలు
- బైక్ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు
- బస్భవన్ వద్ద న్యాయవాదుల అరెస్టు
- సమ్మె కొనసాగుతుంది : టీఎస్ఆర్టీసీ జేఏసీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్రంలో కార్మికోద్యమాల ప్రాముఖ్యతను వెల్లడిస్తున్నది. కోర్టుఆదేశాల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం శుక్రవారం రాత్రి వరకు చర్చల కోసం ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలకు ఎలాంటి వర్తమానం పంపలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, కార్యదర్శి సునీల్శర్మతో పాటు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమావేశం అయ్యారు. సమ్మె సమయంలో ఆర్టీసీ బస్సుల్ని ఎలా నడపాలి అనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. పోలీసుల పహారా నడుమ ప్రజలకు ఎలాంటి రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. శుక్రవారం ఆరువేలకు పైగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పినట్టు అధికారులు వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నేరుగా మంత్రుల స్థాయిలో కాకుండా అధికారుల స్థాయిలోనే చర్చల్ని జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ బాధ్యతల్ని రవాణాశాఖ కార్యదర్శి సునీల్శర్మకే అప్పగించినట్టు సమాచారం. ఆయనే జేఏసీ నేతలతో చర్చించి, నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వపరంగా తన నిర్ణయం చెప్పేశానని, కోర్టు ఆదేశాల్ని అమలు చేసే బాధ్యత అధికారులదేనని కేసీఆర్ స్పష్టంచేసినట్టు తెలిసింది. ఈ మేరకు శనివారం ఉదయం జేఏసీ నేతలకు చర్చల కోసం వర్తమానం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు టీఎస్ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపునకు టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు సహా సకల జనులూ మద్దతు పలికారు. 14వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా బైక్ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాలు, రాస్తారోకోలు జరిగాయి. బంద్పై ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ(ఎం), సీపీఐ, ఎమ్సీపీఐ(యు), సీపీఐ(ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి,
తెలంగాణ ఇంటిపార్టీ, తెలంగాణ ప్రజాపార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్తో పాటు ప్రజా, యువజన, విద్యార్ధీ, మహిళా, కార్మిక, ఉద్యోగ సంఘాలు సంపూర్ణంగా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్భవన్ వరకు బైక్ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి సహా పలువురిని అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. బస్భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన న్యాయవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో తాత్కాలిక డ్రైవర్ ఒకరు తాత్కాలిక మహిళా కండక్టర్పై అత్యాచారయత్నం చేయడం సంచలనం కలిగించింది. ఆ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మంలో జరిగిన బైక్ర్యాలీ, ధర్నాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. పోలీసులు అడుగడుగునా బారికేడ్లు పెట్టి ప్రదర్శనకారుల్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పటాన్చెరు నుంచి కూకట్పల్లి వరకు భారీ స్కూటర్ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాన్ని పాలకులు మర్చిపోవద్దని హెచ్చరించారు. శనివారం జరిగే బంద్కు కవులు, కళాకారులు, సాంస్కృతిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ప్రభుత్వం చర్చలకు పిలిచినా సమ్మె మాత్రం కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి (టీఎమ్యూ), కో కన్వీనర్లు కె రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వీఎస్ రావు (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్), ఓ సుధ (సూపర్వైజర్స్ అసోసియేషన్) తెలిపారు. చర్చలు జరిగినా, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాము సమ్మెలోనే ఉంటామనే విషయాన్ని తమ తరఫు న్యాయవాది కోర్టులో న్యాయమూర్తులకే చెప్పారని వారు గుర్తుచేశారు. శనివారం బంద్లో ఆటోసంఘాలు, క్యాబ్డ్రైవర్లు కూడా మద్దతు తెలిపారు. ఓలా, ఊబర్ ఆటోలు, క్యాబ్లు కూడా రోడ్లపై తిప్పబోమని వారు స్పష్టం చేశారు.