Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు రెచ్చగొట్టినా ఆవేశపడం.. శాంతియుతంగా ముందుకెళ్తాం
- ప్రజారవాణాను బతికించుకోవడమే లక్ష్యం
- సర్కారు మొండి వైఖరిని వీడి సమస్యలను పరిష్కరించాలి
- నేటి బంద్ను జయప్రదం చేయండి
- జేఏసీ నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''సర్కారు బదనాం చేసేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా సమ్మెను సకల జనుల్లోకి తీసుకెళ్లాం. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె పోరాట రూపంలోకి నేటి సమ్మె వెళ్తున్నది. ఇది సర్కారుకు హెచ్చరికలాంటింది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదమూ పొంచి ఉంది. కావాలనే సర్కారు ముమ్ముల్ని రెచ్చగొడుతున్నది. మేమెక్కడా తొందరపడం.. ఆవేశపడం శాంతియుతంగా ప్రజా రవానాను బతికించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రాష్ట్ర సర్కారు సమస్యలకు పరిష్కరించాలి. రాజకీయ పార్టీలు, కార్మికులు ఇచ్చిన నేటి బంద్ పిలుపును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి' అని ఆర్టీసీ జేఏసీ నేతలు ముక్తకంఠంగా పిలుపునిచ్చారు. నవతెలంగాణతో వారు ప్రత్యేకంగా ముచ్చటించారు.
మరో సకలజనుల సమ్మె కాబోతున్నది :
అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
మేం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. హైకోర్టు అక్షింతలు వేసినా సర్కారు మాత్రం కార్మికులతో చర్చలేంటి? అన్న మొండివైఖరితో ముందుకు వెళ్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. పైగా హింసను ప్రోత్సహించేలా రాష్ట్ర సర్కారు తీరు ఉంది. సర్కారు కొన్ని పత్రికలకు, ఓ మీడియా సెక్షన్కు లీకులిచ్చి కార్మికులను బెదిరించాలని చూస్తున్నది. ఓ పక్క ప్రజారవాణాను నిర్వీర్యం చేసి ప్రయివేటుకు కట్టబెట్టే ప్రయత్నాలను చేస్తూనే...మరోపక్క ఆర్టీసీ కార్మికులను ప్రజల్లో బదనాం చేయాలని చూస్తున్నది. కానీ, ప్రజలు తెలివైనోళ్లు. కేసీఆర్ ఎత్తుగడల్ని పసిగట్టారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఎంత రెచ్చగొట్టినా... మేమెక్కడా ఆవేశపడబోం. తొందరపడం. శాంతియుతంగా అందరి మద్దతు కూడగట్టుకుని ముందుకెళ్తాం. మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు...ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేయాలనీ, ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వం భరించాలనీ, ప్రజా రవాణా వ్యవస్థను బతికించాలని డిమాండ్ చేస్తున్నాం. 20 శాతం బస్సుల ప్రయివేటీకరణ ఎత్తులను తిప్పికొడతాం. అన్ని సంఘాల మద్దతును కూడగట్టుకుని ముందుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాం. మరో సకలజనుల సమ్మె రూపాన్ని ఆర్టీసీ సమ్మె తీసుకోబోతున్నది. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మంత్రులందరూ ముందుకొచ్చి అందగా నిలవాలి. శుక్రవారం నాడు కూడా హైకోర్టు మెట్టికాయలు వేసినా సర్కారులో చలనం లేదు. సమ్మె ఆవశ్యకతను గుర్తించి తమకు బాసటగా నిలవాలని చేతులెత్తి వేడుకుంటున్నాం.
విచ్ఛిన్న చర్యను తిప్పికొట్టి...ప్రజా రవాణాను కాపాడుకుంటాం
వీఎస్.రావు, ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయ త్నాన్ని రాష్ట్ర సర్కారు చేస్తున్నది. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని అంటున్నది. రాజ్యాంగంలో అసలు అది ఉందా? కార్మిక శాఖ మంత్రిగా చేసి ఇలాంటి మాటలు మాట్లాడటమేంటి? కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించుకొని 18వ తేదీన రావాలని హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ తన మొండితనాన్ని వీడలేదు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవలేదు. మరింత మొండిగా వ్యవహరిండాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైనది కాదని ప్రభుత్వం వాదిస్తూ అందుకు తగ్గట్టుగా అనుకూల పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేస్తున్నది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపుఉండగా...యావత్ తెలంగాణ సమాజమంతా ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవడం అంటేనే వందశాతం న్యాయబద్ధ సమ్మె. కార్మిక సంఘాల నేతలు మాత్రమే సమ్మె చేస్తున్నారని అంటున్నవాళ్లకు...50 వేల మంది కార్మికులు ఒకేమాట మీద నిలబడి సమ్మె చేస్తున్నది కండ్లకు కనబడకపోతే మనమేమీ చేయలేం. ప్రజా రవాణాను బతికించాలనే డిమాండ్తో ముందుకెళ్తున్నాం కాబట్టే రాజకీయ పార్టీలన్నీ తమకు మద్దతుగా 19వ తేదీన రాష్ట్రబంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించి మిగతా కార్మిక సంఘాలన్నీ 19న ఒకరోజు నిరసన సమ్మెకు పిలుపునిచ్చాయి. సీఐటీయూ జాతీయ నేతలు ఇక్కడకు వచ్చి మరీ సమ్మెకు మద్దతుగా నిలిచారు. సమ్మెకు సహకరిస్తున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
కోర్టు మాటలంటే లెక్కలేనితనం...:
రాజిరెడ్డి, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్
కోర్టు సూచనల మేరకు చర్చలకు పిలిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా... ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. సీఎం మొండివైఖరిని ఖండిస్తున్నాం. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడానికి, అద్దె బస్సులను నివారించడానికి, ప్రజారవాణను బతికించుకో వడానికే మా పోరాటం. అట్లాగే, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఏడు వేల పోస్టులను భర్తీ చేయాలి. 20 శాతం ప్రయివేటు బస్సులను అనుమతిస్తామని సీఎం అంటున్నారు... అట్లాగైతే లాభాలు వచ్చే ప్రధాన రూట్లతోపాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే ఆ బస్సులను నడుపుతారు.
నష్టాల్లో వచ్చే మండల కేంద్ర, గ్రామీణ ప్రాంతాల రూట్లలో ఆ బస్సులను నడపవు. అక్కడ ఆర్టీసీనే నడపాలను చెబుతారు. అంటే, ఇంకా ఆర్టీసీని నిర్వీర్యంచేసి చావుదెబ్బతీసే కుట్రకు రాష్ట్ర సర్కారు తెరలేపింది. దీన్ని తిప్పికొట్టి ప్రజారవాణాను కాపాడుకుంటాం. పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నాం...టెంపరరీ ఉద్యోగాలకు మీ పిల్లలను పంపొద్దనీ వేడుకుంటున్నాం. ప్రజారవాణా పరిరక్షణ కోసం జరుగుతున్న పోరుకు సకలజనులందరూ మద్దతు తెలపాలనీ, నిరంకుశ, నియంతృత్వ వాది అయిన కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం.