Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు
- 24 వరకు 144 సెక్షన్
నవతెలంగాణ- మఠంపల్లి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి రోజు అన్ని పార్టీల ముఖ్య నాయకులు సుడిగాలి పర్యటనలు చేశారు. 21వ తేదీన పోలింగ్, 24న కౌంటింగ్ జరగనుంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె, మరో వైపు ఎన్నికలు ఉండటంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఈనెల 24వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ప్రచారం ముగియడంతో అధికార పార్టీ నేతలు ప్రలోభాలపై దృష్టిపెట్టారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని గ్రామాల్లో మకాం వేశారు. తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం కోసం సామాజిక తరగతుల వారీగా సమీకరణలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగడంతో ఈ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపనుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4వ తేదీన రోడ్షో నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సమ్మె కారణంగా రోడ్షోలు రద్దు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా రద్దయింది. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తుండటంతో.. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో చివరి రెండు రోజులు ప్రజల నుంచి స్పందనా కరువవైంది.
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతోపాటు ఈ ఎన్నికను సవాల్గా తీసుకుని అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా గ్రూపులను పక్కన బెట్టి ప్రచారంలో పాల్గొనడం విశేషం. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి కుంతియా సైతం ప్రచారంలో పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) బలపర్చిన తెలంగాణ ప్రజాపార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్ తరపున ఆ పార్టీ రాష్ట్ర నేత చంద్రకుమార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్ సహా జిల్లా నాయకత్వం ప్రచారంలో పాల్గొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎండగట్టారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి తరపున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(ప్రవీణ్), బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ప్రలోభాలతో ఎర
ప్రచారం ముగియడంతో ఇక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుచోట్ల అధికారపార్టీ నాయకులకు సంబంధించిన మద్యం, డబ్బు పట్టుకున్న విషయం విదితమే. గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఇండ్లను అడ్డాగా చేసుకుని డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రచారం సందర్భంలోనే సామాజిక తరగతుల వారీగా తాయిలాలు ముట్టజెప్పినట్టు సమాచారం. కొందరికి పదవులు ఇస్తామనీ, మరికొందరికి రుణాలు ఇస్తామనే పేర ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. వార్డుల వారీగా ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి, తమ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయోనని అంచనా వేస్తున్నారు.
ఓటింగ్కు అధికారుల ఏర్పాట్లు
నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 28మంది బరిలో ఉన్నారు. ఈ నెల 21న పోలింగ్ జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగమయ్యారు. 7 మండలాల్లో మొత్తం ఓటర్లు 2,36,842 మంది ఉన్నారు. 302 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 79 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.