Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపులో భాగంగా రాష్ట్రబంద్లో పాల్గొన్న ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్కుమార్, కార్యదర్శి ఎ విజరుకుమార్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. పోలీసులు కర్కషంగా దాడి చేశారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు రోడ్ల మీది నుంచి లాగి, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేయడంతో రక్తం కండ్ల చూశారని తెలిపారు. పోలీసులు గిచ్చడం, గీరడం, రోడ్ల మీద అడ్డగోలుగా లాగడం, ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం ఫ్రెండ్లీ పోలీస్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కసిగా ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం: ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రబంద్లో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న రాజకీయ, ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. పిడిగుద్దులతోపాటు లాఠీచార్జీ చేశారని తెలిపారు. అనేక జిల్లాల్లో విద్యార్థి నాయకులను అర్ధరాత్రి ఇండ్లకు వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలని చూస్తున్న కేసీఆర్ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించిన రాయితీలు రూ.2,800 కోట్లలో ఇంకా రూ.710 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపారు. రాయితీల సొమ్మును ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షలు జేఈఈ, నీట్ వంటి వాటికి ప్రిపేరయ్యే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.