Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో..
నవతెలంగాణ - మంచిర్యాల
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో మహారాష్ట్ర ఎన్ఐఏ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హార్డ్ డిస్క్, సీడీ, విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ డాక్టర్గా పని చేశాడు. రిటైర్డ్ అయిన అనంతరం జిల్లా కేంద్రంలోని తన ఇంట్లోనే ఆస్పత్రి నడిపిస్తున్నాడు. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన నిర్మల అలియాస్ నర్మద క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కొద్ది రోజుల కిందట డాక్టర్ వద్ద చికిత్స తీసుకుంది. అనంతరం ఆమె పోలీసుల ఎదుట లింగిపోయింది. అయితే, మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో మాజీ మావోయిస్టులను విచారిస్తున్న క్రమంలో నిర్మలను కూడా విచారించారు. ఆమె తెలిపిన సమాచారం మేరకు చంద్రశేఖర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు నిర్వహించిన సోదాల్లో సీడీ, హార్డ్ డిస్క్, విప్లవ సాహిత్య పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై డాక్టర్ను వివరణ కోరగా, గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన కారణంగానే తన ఇంట్లో సోదాలు నిర్వహించారని తెలిపారు.