Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడూ, నేడు 'ప్రయివేటు' కోసం ఎత్తులు
- నష్టాల ఊబిలోకి నెట్టి చంపేయాలనే కుతంత్రాలు
- ఆర్టీసీపై చంద్రబాబు, వైఎస్, కేసీఆర్లది ఒకే బాట, ఒకే మాట
- కార్మిక ఐక్యత విచ్ఛినానికి కుయుక్తులు
- కాలచక్రంతో పోటీ పడుతూ సాగుతున్న ఆర్టీసీ చక్రం
గుడిగ రఘు
ఆర్టీసీపై ఆది నుంచి కుట్రలే. పాడియావు లాంటి ఆర్టీసీని పిండుకుని తాగాలనే పాలకుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ప్రజా సేవకు అంకితమైన ఆవిర్భవించిన ఆర్టీసీని ఎలాగైనా చంపేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయడం ద్వారా ప్రజా సొమ్మును అప్పనంగా కొల్లగొట్టి కోట్లు గడించవచ్చనే గజనీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీలు వేరైనా ఆర్టీసీ విషయంలో పాలకుల వైఖరి ఇదే. ఈ ప్రయత్నాలను వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు తిప్పికొడుతూనే ఉన్నాయి. ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ రక్షణ కోసం సర్వశక్తులొడ్డుతూనే ఉన్నాయి. అయినా ఆర్టీసీ ప్రయివేటీకరణ కోసం పాలకులు కుతంత్రాలు, కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నష్టాల ఊబిలోకి నెట్టేసి, అదిగో నష్టాలు, ఇదిగో ఆర్టీసీ కష్టాలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని పరాకాష్టకు చేర్చారు. ఆ దారిలోనే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నడుస్తున్నారు. ఆర్టీసీ విషయంలో ఆ ముగ్గురివి అవే వాదనాలు, అవే బెదిరింపులు, అవే హెచ్చరికలు ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగానే ఆర్టీసీ నష్టాల పాలవుతుందనేది జగమెరిగిన సత్యం. ఆర్టీసీని చంపే అంశంలో చంద్రబాబు, కేసీఆర్కు సారూప్యత ఉన్నది. అందుకు వైఎస్ కొంత భిన్నంగా వ్యవహరించినా...వారి లక్ష్యం మాత్రం ఆర్టీసీని ప్రయివేటీకరనకే.
ఆర్టీసీ ధ్వంసమే లక్ష్యమా?
సకల జనులను నిత్యం తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రజా రవాణా ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన నాటికి తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండేది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయివేట్ వాహనాలు నడిచేవి. అయితే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రయివేట్ వాహనదారులు ఆసక్తి చూపలేదు. తెలంగాణ ప్రాంతంలో కొంతలో కొంతైనా బస్స్టాండ్లు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో ప్రయివేట్ వాహనాలను రద్దు చేయాలంటూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయి. బస్సుచార్జీలు పెంపుదల, పేస్కెల్స్, అలవెన్స్, సర్వీస్ కండిషన్లు మెరుగుదల కోసం కూడా కార్మిక పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరపడం తాత్కాలికంగా కార్మికులకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో పాలకుల అసలు లక్ష్యం నెరవేర్చుకోవడానికి తమ ప్రయత్నాలను మాత్రం మానుకోలేదు. 1995-96 వరకు ఆర్టీసీ సంస్థ 45 కోట్ల లాభాలను ఆర్జిస్తున్నది. అప్పటిదాకా లాభాల బాటలో నడుస్తున్న ఆర్టీసీపై పాలకుల కన్నుకుట్టింది. పాము తన పిల్లలను తానే భక్షించినట్టు ఆర్టీసీని నష్టాల బాటవైపుకు నెట్టింది. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం చంద్రబాబు విజన్ 2020 పేరు నివేదిక రూపకల్పన చేశారు. ప్రజా రవాణా రంగాన్ని ప్రయివేటుపరం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. బస్సుల్లో టిమ్స్ ప్రవేశ పెట్టారు. ఆర్టీసీలోని వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. బలహీన పరిచేందుకు వేగంగా అడుగులే. దీంతో కార్మికులు ప్రతిఘటించారు. 24 రోజులు సమ్మె చేశారు. వీరోచితంగా పోరాడారు. ఈ ప్రభావంతోనే చంద్రబాబు గద్దెదిగారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ రక్షణ కోసం అనేక వాగ్ధానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయివేట్ పరం చేయడానికే కార్మికుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించారు. బస్సులను తగ్గించి ప్రయివేట్ వాహనాలను ప్రోత్సహించారు. పైగా ప్రయివేట్వారు బతకొద్దా? అంటూ కార్మిక సంఘాలను ప్రశ్నించి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.
చంద్రబాబు, వైఎస్ దారిలోనే కేసీఆర్
ఉమ్మడి రాష్ట్ర పాలకులకు భిన్నమైన పాలన అందిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్...అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఆర్టీసీకి ఇవ్వలేదు. ఆర్టీసీ రూ 3,200 కోట్ల నష్టాలకు కార్మికులే కారణమంటూ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నది. ఈ ఐదేండ్ల కాలంలో వివిధ వర్గాలకు ఇచ్చినరాయితీలురూ 2,800 కోట్ల బకాయిలు ఆర్టీసీకి చెల్లించాల్సిన సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వమే ఆర్టీసీని నష్టపరుస్తూ కార్మికులు, వామపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నది. పైగా కార్మికులు సమ్మె చేస్తున్నా చలించడంలేదు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడానికి ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో కార్మికులతో సీఎం తొండి చేస్తున్నారు.
ఇద్దరు చంద్రులది అదే తీరు...
తమ హక్కుల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం చంద్రబాబు హయాంలో కార్మికులు 28 రోజులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 15 రోజులు గడుస్తున్నది. సమ్మె సమయంలో కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి నాడు చంద్రబాబు ఎలాంటి ఎత్తులు, జిత్తులు వేశారో, కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీ కార్మికులను నియమించడం, శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులు ఇవ్వడంతో ప్రమాదాలకు గురికావడం, టూరిస్టు,స్కూల్,ప్రయివేట్ బస్సులను స్టేజీ కారియర్లుగా తిప్పడం, ఎక్కడిక్కడ 144 సెక్షన్లు పెట్టడం, సమ్మెపై దుష్ప్రచారం చేయడంలో ఇద్దరిది ఒకే మాట..ఒకే బాట. ఏదో రకంగా కార్మికులను భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారిది ఒకటే తీరు.
బెదిరించడంలోనూ ఒకే ధోరణి
సమ్మె సమయంలో కార్మికులను, కార్మికనాయకులను బెదిరించడంలో ఒకే ధోరణి కనిపిస్తున్నది. ఆర్టీసీ రక్షణ కోసం కార్మికులు సమ్మె చేస్తుంటే...వారిని భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలనే నిరంకుశత్వం కనిపిస్తున్నది. సర్కారు బెదిరిం పులకు కార్మికులు లొంగిపోతారనే సంకుచిత ఆలోచనలు చేసిన వారే. కార్మికుల అరెస్టులు, ఇండ్లలో సోదాలు చేయించడంతోపాటు ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించడం పాలకులకు అలవాటుగా మారింది. అద్దె బస్సులకు చంద్రబాబు బీజం వేస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. మొక్కవోని దీక్షలు..చెక్కు చెదరని పట్టుదల
ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలనే పాలకుల కుట్రలను కార్మికులు మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూనే ఉన్నారు. అది చంద్రబాబైనా, వైఎస్సారైనా, కేసీఆరైనా...సరే వారి విధానాలకు వ్యతరేకంగా చెక్కు చెదరని పట్టుదలతో పోరాడుతున్నారు. మొదట్లో బస్సు చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు గళం విప్పేవి..కదం తొక్కేవి. తదనంతరం ఆర్టీసీ మనుగడనే పాలకులు ప్రశ్నార్థకం చేశారు. 'పిచ్చికుక్క ఫార్ములా'ను ప్రయోగించి ఆర్టీసీ నిర్వీర్యం చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు. కాలచక్రానికి కార్మికులు ఎదురొడ్డి నిలిచి ఆర్టీసీ చక్రాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే కార్మికులు సంఘటితంగా పోరాడుతూనే...విశాల మద్దతు కూడగడుతున్నారు. నాడు చంద్రబాబు, వైఎస్ మెడలు వచ్చినట్టుగానే నేడు కేసీఆర్ సర్కారు మెడలు వంచుతామని కార్మికులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు.