Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురి మృతదేహాలు లభ్యం
- స్నేహితుని పెండ్లికి వెళ్లి వస్తుండగా సూర్యపేట జిల్లాలో ఘటన..
నవతెలంగాణ - నడిగూడెం
సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శనివారం వెలికితీసింది. కారులో ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో దాదాపు 15 గంటల పాటు శ్రమించి క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. ఘటనా స్థలం వద్ద బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాద్లో అంకుర్ ఆస్పత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని పెండ్లి చాకిరాలలో శుక్రవారం జరిగింది. వివాహానికి అంకుర్ ఆస్పత్రి సిబ్బంది 11 మంది రెండు కార్లల్లో హైదరాబాద్ నుంచి చాకిరాల వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో నడిగూడెం మండల కేంద్రంలోని సాకిరాల గుంతను తప్పించబోయి స్కార్పియో కారు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఆ కారులో అబ్దుల్ అజీజ్(45), రాజేష్(29), జాన్సన్(33), సంతోష్కుమార్(23), నరేష్(35), పవన్కుమార్(23) ఉన్నారు. వెనకాలే మరో కారులో వస్తున్న స్నేహితులు.. కారు కాల్వలో పడిపోవడాన్ని గమనించి వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. రాత్రి ఘటనా స్థలానికి కలెక్టర్ అమరుకుమార్, ఎస్పీ భాస్కరన్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్ఛార్జి రాహుల్ దీక్షిత్ చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు వెలికితీయడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 15 గంటలపాటు శ్రమించి 18 అడుగుల లోతులో ఉన్న కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న ఆరుగురూ ఊపిరాడక మృతిచెందారు. మృతదేహాలను చూడగానే కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.