Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్
- ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ కార్మికుల చేపట్టిన రాష్ట్రబంద్ మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు జరిగాయి. హైదరాబాద్లో డీఈవో, వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ కారం రవీందర్రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 16 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీని పిలిచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం డిమాండ్లపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించామని అన్నారు. ఈనెలాఖరులోగా సంఘాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్, నాయకులు బి రేచల్, రామినేని శ్రీనివాసరావు, ఎం మహిపాల్రెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చర్చలు జరపాలి :యూఎస్పీసీ, జాక్టో డిమాండ్
ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ శనివారం సంపూర్ణంగా విజయవంతమైందని యూఎస్పీసీ, జాక్టో ప్రకటించాయి. ఈ మేరకు యూఎస్పీసీ, జాక్టో ప్రతినిధులు సిహెచ్ రాములు, చావ రవి, జి సదానందంగౌడ్, ఎం పర్వతరెడ్డి, వై అశోక్కుమార్, మైస శ్రీనివాసులు, రఘుశంకర్రెడ్డి, టి లింగారెడ్డి, రఘునందన్, ఎం రాధాకృష్ణ, పి చంద్రశేఖర్, పోచయ్య, డి సైదులు, కె కృష్ణుడు, బి కోటేశ్వర్, షౌకత్అలీ, చెన్నరాములు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చించాలి : పీఆర్టీయూ తెలంగాణ
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : ఎస్జీటీయూ
ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని కోరుతూ శనివారం రాష్ట్రబంద్లో పాల్గొన్న ఉపాధ్యాయులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్జీటీయూ అధ్యక్షులు మధుసూదన్రావు, ప్రధాన కార్యదర్శి మహిపాల్రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు.