Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంటీబయాటిక్స్కు లొంగని బ్యాక్టీరియాలు
- ప్రమాదపుటంచుల్లో రోగులు
- విక్రయాలపై ప్రభుత్వ అజమాయిషీ కరువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏదైనా రోగం వస్తే మందు వేసుకుంటే తగ్గుతుంది. ఇది సాధారణంగా అందరికి తెలిసిన వాస్తవం. కానీ భవిష్యత్తులో రోగాలకు మందులు పని చేసే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందులు పని చేయని స్థితికి చేరుకున్నాయి. భవిష్యత్తులో మరిన్ని మందులు కూడా అదే సరసన చేరబోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మందులను కనిపెడుతున్నా... వాటి కన్నా పని చేయకుండా పోతున్న మందుల శాతం చాలా ఎక్కువగా ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 50 ఏండ్లలోనే ప్రజలు పెనువిపత్తుకు అంటే సామూహిక అంతానికి గురికాక తప్పదని ఈ రంగంలో అనుభవజ్ఞులు అంచనా వేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిఘా, పర్యవేక్షణను గాలికొదిలేసిన కారణంగా యాంటీబయాటిక్స్ మందుల వాడకం గాడి తప్పింది. ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో, అందుకు తగ్గట్టు ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. 2015లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 15 అసెంబ్లీ సమావేశంలో యాంటీబయాటిక్స్ నియంత్రణకు సభ్యదేశాలన్నీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని మనదేశం పిలుపునిచ్చింది. నాలుగేండ్లలో పిలుపునిచ్చిన దేశంలోనే యాంటీబయాటిక్స్ వాడకం అత్యంత పెనుప్రమాదం స్థాయికి చేరుకోవడం గమనార్హం. వీటి నియంత్రణకు మార్గదర్శకాలు, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో నిబంధనలు, ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, ఫార్మసీ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రజలు ప్రమాదపుటంచులకు చేరుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) ఉన్నప్పటికీ అది దాదాపు లైసెన్సులు జారీ చేసేందుకే పరిమితమైందని చెప్పాలి.
క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం .... అన్నీ ఆస్పత్రుల్లో విధిగా హాస్పిటల్ ఫార్మసీ అండ్ థెరపటిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి చీఫ్ ఫార్మసిస్ట్ కన్వీనర్గా , హాస్పిటల్ సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ అధ్యక్షునిగా ఉండాలని ఈ చట్టం చెబుతున్నది. మిగిలిన అన్ని క్లినికల్ విభాగాల నుంచి సభ్యులుంటారు. ఒక మైక్రో బయాలజిస్ట్కు ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఫిజిషియన్ హౌదా ఇచ్చి యాంటీబయాటిక్స్ పాలసీని అమలు చేయాల్సి ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చెప్పుకునే నిమ్స్ లాంటి ఆస్పత్రిలోనే ఇప్పటి వరకు క్లినికల్ ఫార్మసీ డిపార్ట్ మెంట్ లేదంటే ఇక మిగిలిన ఆస్పత్రుల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రయివేటీ కరణ విధానాలు కూడా ప్రజలను యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా వాడే పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించకపోవడం, వైద్యులను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం, రోగ నిర్ధారణ పరీక్షలకు అయ్యే ఖర్చులను నియంత్రించకపోవడం, ఉచితంగా దొరకకపోవడం కూడా యాంటీబయాటిక్స్ వాడకం పెరగడానికి కారణమవుతున్నాయి. రోగనిర్ధారణ జరగక ముందే మందులు ప్రిస్క్రైబ్ చేయాలని రోగులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
అవగాహన ఏదీ?
మందుల వాడకంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మందులు వేసుకుంటే రోగం తగ్గుతుందని మాత్రమే తెలిసిన ప్రజలు మెడికల్ షాపుల్లో ఇచ్చిన మందులతో సరిపుచ్చుకుం టున్నారు. సరైన మందులు కాకుండా ఇతర మందులు వేసుకున్నా, పూర్తి కోర్స్ మందులు వేసుకోకపోయినా అవి భవిష్యత్తులో పని చేయవనే సంగతి తెలియకుండానే తమ శరీరాన్ని మందులు పని చేయని స్థితికి తెచ్చుకుంటున్నారు.
వైద్యులు, వైద్యసిబ్బంది ఏరీ?
వైద్యులు, వైద్యసిబ్బంది ఇప్పటికీ చాలా గ్రామాలకు అందుబాటులో లేరు. దీంతో ప్రజలు అనివార్యంగా ప్రయి వేటు ఆస్పత్రులతో పాటు నకిలీ వైద్యులు, అనుభవంతో వైద్యులుగా చెలామణి అవుతున్న కాంపౌండర్ల బారిన పడుతున్నారు. దీంతో భవిష్యత్తులో మళ్లీ అదే రోగం వచ్చినప్పుడు ఆ మందులు పని చేయడం లేదు.
రోగనిర్ధారణ ఏదీ?
ఒక రోగం లేదా రుగ్మత కలగడానికి ప్రతిసారి ఒకే కారణం ఉండక్కర్లేదు. కొన్నిసార్లు ఫంగస్, మరికొన్ని సార్లు వైరస్, పరాన్నజీవులు (పారాసైట్స్), ఇంకొన్ని సందర్భాల్లో హానికర బాక్టీరియా కారణంగా రోగాలు రావచ్చు. వచ్చిన రోగాన్ని బట్టి కారకాన్ని తెలుసు కునేందుకు అవసరమైన పరీక్షలు చేయాలి. ప్రభుత్వా స్పత్రుల్లో అన్ని రోగనిర్ధారణ పరీక్షలు లేకపోవడం, ఉన్నవా టికి కూడా భారీ వెయిటింగ్ ఉంటుండడంతో నిర్ధారణ కాక ముందే యాంటీబయాటిక్స్ తో తాత్కాలికంగా తగ్గించుకు ంటున్నారు. బయటికి తగ్గినట్టు కనిపించినప్పటికీ, సరైన మందులు వాడకపోవడంతో రోగకారకం మూలాల్లో అలాగే ఉండిపోయి యాంటీబయాటిక్స్ను తట్టుకునే శక్తిని పెంచు కుంటుంది. ఇలాంటి వారికి భవిష్యత్తులో అవసరమైనప్పుడు అవే యాంటీబయాటిక్స్ ఇచ్చినా పని చేయవు.
నమోదు తప్పనిసరి చేయాలి
యాంటీబయాటిక్స్ విక్రయాల నమోదును తప్పనిసరి చేయాలని తెలంగాణ గవర్నమెంట్ అసోసియేషన్ సలహాదారు రాపోలు సత్యనారాయణ సూచించారు. ఔషధాల విక్రయాలకు బిల్లులు ఇస్తున్నప్పుడే అందులో యాంటీబయాటిక్స్ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయించాలని చెప్పారు. అర్హులైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మందులు విక్రయించకుండా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- రాపోలు సత్యనారాయణ
అణుబాంబు అక్కర్లేదు.. యాంటీబయాటిక్స్ చాలు
యాంటీబయాటిక్స్ ఇలాగే ఇష్టాను సారంగా వాడితే అణుబాంబు అక్కర్లేకుండానే మానవాళి అంతమై పోతుందని చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ వంశీ హెచ్చరించారు.దీన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తక్షణం మేల్కొ వాల్సిన అవసర ముందని అన్నారు. యాంటీబయాటిక్స్ మందులను కనుగొనే పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, పూర్తిగా ప్రయివేటుపై ఆధార పడడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
- డాక్టర్ వంశీ.