Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి.ఎస్. రావు
ఆర్టీసీ పరిరక్షణ కోసం, ప్రజా రవాణా సంస్థను కాపాడుకోవడం కోసం, మొక్కవోని దీక్షతో 15 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మిక సోదరీ, సోదరులందరికి ఆర్టీసీ జెజేఏసీ తరపున, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. సంస్థ రక్షణ కోసం మనం చేస్తున్న సమ్మెను పాలక పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బలపర్చి, అండగా నిలబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సంఘాలు, బ్యాంక్, ఇన్సూరెన్స్, సింగరేణి, మున్సిపల్, గ్రామపంచాయతీ తదితర అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించారు.
అక్టోబర్ 19న రాజకీయ పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వగా, కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని రంగాలలోను కొన్ని వేల సమ్మె నోటీసులు ఇచ్చారు. బంద్పైన ప్రభుత్వం నిర్బంధం ప్రకటించినా ప్రజల సహకారంతో విజయవంతమైంది.
హైకోర్టు డివిజన్ బెంచ్ 18వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల మేరకైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చేస్తుందనే భావిస్తున్నాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగించాల్సి వుంటుంది. కార్మికులు మరింత పట్టుదలతో ఈ సమ్మె నిర్వహించాల్సి వుంటుంది.
కోర్టులో వాదనల కోసం ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లో తెలిపిన అంశాలనే ప్రభుత్వానికి బాకా వూదుతున్న ఒక పత్రిక 'ఆర్టీసీ కథ కంచికే' అన్న శీర్షికను ముద్రించింది. ఆ రెండింటిలో కూడా అనేక అవాస్తవాలు రాయడం ద్వారా ఇటు ప్రజలను అటు కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అందుకని కొన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తేవడం కోసం ప్రయత్నం చేశాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా వున్నప్పుడు 2009-10 నుంచి 2013-14 మధ్య బడ్జెట్ నుండి ఆర్టీసీకి ఇచ్చిన నిధులు కేవలం 712 కోట్లేనని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014-15 నుండి 2018-19 వరకు 4253 కోట్లు ఇచ్చినట్టు రాశారు. ఇది నిజమేనా?
2009-14 మధ్య ఏపీఎస్ ఆర్టీసీలో రాయితీల చెల్లింపుల కింద క్లెయిమ్ చేసింది 3010 కోట్లు అయితే బడ్జెట్ ద్వారా చెల్లించింది 1234 కోట్లు మాత్రమే. ఇవికాక డీజిల్ ఒక్క కొనుగోలు పై వ్యాట్ను 115 కోట్లు తిరిగి ఆర్టీసీకి చెల్లించారు. రెండ్లేండ్ల పాటు 450 కోట్లు మేర ఎం.వి. టాక్స్ మినహాయించారు. వెరసి మొత్తం 1779 కోట్లు ఇచ్చారు. 1231 కోట్లు ఇవ్వలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15 నుంచి 2018-19 వరకు ఆర్టీసీ క్లెయిమ్ చేసిన రాయితీల సొమ్ము 2822.36 కోట్లు. బడ్జెట్ ద్వారా ఇచ్చింది 639.79 కోట్లు. ప్రభుత్వ - హామీ రుణాల ద్వారా ఇప్పించినది 808.76 కోట్లు. రెండూ కలిపితే 1448.55కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఇంకా ప్రభుత్వం నుంచి 1375 కోట్లురావలసి వుంది. (ఆర్టీఐ సమాచారం ఆధారంగా). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వున్న ప్రభుత్వానికి, తెలంగాణలోని ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటి మరి? రెండు ప్రభుత్వాలు ఆర్టీసికి ఇవ్వాల్సిన డబ్బులు సక్రమంగా ఇవ్వలేదని రుజువవుతున్నది.
ఇక రెండో విషయం సాలీనా 1200 కోట్లు నష్టం అంటున్నారు. 2014-15 నుండి 2018-19 మధ్య నష్టాలు 3128.07 కోట్లు అంటే సగటున 625 కోట్లు నష్టం. మరి 1200 కోట్లు అని ఎలా చెప్తున్నారు.
మూడో విషయం 4709 కోట్లు అప్పులున్నాయని పత్రిక రాసింది. సదరు పత్రికలోనే రవాణా మంత్రి రాసిన వ్యాసంలో ఆర్టీసీకి 4000 కోట్లు అప్పులున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రకటనలో 5000 కోట్లు అప్పులు అని రాశారు. ఈ మూడింటిలో ఏది నిజం అని ప్రజలు నమ్మాలి ?
నిజం ఏమిటంటే 2014-15 నుండి 2018-19 వరకు 3234.74 కోట్లు అప్పులు వున్నాయని ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన సమాచార పత్రంలో వుంది. 2019మార్చి తర్వాత గడిచిన 6 నెలల్లో 1500 కోట్లు నుండి 1800 కోట్లకు అప్పులు పెరిగాయా? దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి.
వారెవరూ చెప్పని మరో నిజం మరుగునపడిపోతున్నది. 2014-15 నుండి 2018-19 మధ్య కాలంలో అప్పుల అసలు వాయిదాలు, వడ్డీల చెల్లింపు క్రింద 3493.64 కోట్లు ఆర్టీసీ సంస్థ చెల్లించింది. సంస్థ విడిపోయిన రోజు 2014-15లో రూ.1964 కోట్లుగా వున్న అప్పు 2018-19 నాటికి రూ.3234 కోట్లుగా మాత్రమే పెరిగింది. అంటే నికరంగా పెరిగిన అప్పు రూ.1270 కోట్లు. మరో కోణంలో విశ్లేషించుకుంటే ఆర్టీసి తన అంతర్గత వనరుల ద్వారా రూ.2223 కోట్లను సమకూర్చుకొందని రుజువవుతున్నది.
నాలుగో విషయం ఆర్టీసి సమ్మె వల్ల గడచిన 14 రోజుల్లో రూ.158 కోట్లు నష్టం వచ్చిందని, అలాగే ఆర్టీసి అకౌంట్లో కేవలం 8 కోట్లే వున్నాయని ఇన్చార్జ్ ఎమ్డీ ప్రకటన చేశారు.
సమ్మె జరుగుతున్నా 73శాతం బస్లు నడుపుతున్నామని యాజమాన్యం తరఫున కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వారు చెప్పింది నిజమైతే మరి రోజుకి 10 నుండి 11 కోట్లు ఆర్టీసీకి ఆదాయం రావాలి గదా? 14 రోజుల్లో 140 కోట్లు ఆదాయం వచ్చి వుండాలి. మరి కేవలం 8 కోట్లే ఎందుకు బ్యాంక్లో వున్నాయి? మిగతా డబ్బులు ఏమయ్యాయో సంస్థ యాజమాన్యం ప్రకటన చేయాలి కదా? అలాగే అన్ని బస్లు తిరిగినా సమ్మె వల్ల 150 కోట్లు నష్టమని ఎలా ప్రకటించారు?
అలాగే బస్ల కొనుగోలుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేవని అంటున్నారు. 2014-15 నుండి 2018-19 మధ్య సుమారు 650 కోట్లు కి.మీటర్లు ఆర్టీసీ బస్లు తిరిగాయి. యంత్ర సామాగ్రి అరుగుదల క్రింద ప్రతి కిలో మీటర్కు రూపాయి చొప్పున అకౌంట్లలో చూపెడుతున్నారు. అంటే 650 కోట్లు బస్ల కొనుగోలుకు నిధులు వున్నట్టే కదా? మరి బస్లు ఎందుకు కొనడం లేదు? ఆ నిధులు ఏమయ్యాయి? ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి.
అందుకని ప్రభుత్వం, యాజమాన్యం ఆర్టీసీ పట్ల, కార్మికుల పట్ల, కార్మికోద్యమం పట్ల అబద్ధాలు, అర్ధసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలి. తక్షణమే జేఏసీతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరుతున్నాం.