Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శిథిలావస్థకు చేరిన సరాయి భవనం శనివారం సాయంత్రం కూలింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ రెస్క్యూ బృందాలు అక్కడికెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. డీఆర్ఎఫ్కు చెందిన రెండు ప్రత్యేక బృందాలు జేసీబీ, ఇసుజు వాహనాలతో శిథిలాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించాయి. దాదాపు వందేండ్ల చరిత్ర కలిగిన నాంపల్లి సరాయి విశ్రాంతి భవనాన్ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1919లో 5,828 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంపల్లి రైల్వేస్టేషన్కొచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, ఇతర అవసరాలకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చేవారి కోసం ఈ సరాయిని నిర్మించారు. ఈ భవనాన్ని 2011లో హెరిటేజ్ భవనంగా ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో జీహెచ్ఎంసీ నిరుపేదల కోసం అందిస్తున్న ఐదు రూపాయల భోజన పథకం మొదటి కేంద్రాన్ని ఈ భవనంలోనే ప్రారంభించారు. ఈ సరాయి భవనాన్ని ఆనుకుని ఉన్న ఇతర భవనాలు కూడా పురాతనమైనవి కావడంతో.. వాటికి ఎలాంటి నష్టం జరగకుండా శిథిలాల తొలగింపు చేపడుతున్నారు.