Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు డబ్బాలతో నిరసన
- సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు
నవతెలంగాణ - పెబ్బేరు
దొరల నుంచి దాన విక్రయం కింద వచ్చిన భూమి వివాదాస్పదమైంది. తన భూమికి సరిహద్దులు చూపడం లేదని మూడు రోజుల కిందట రైతు ఆత్మహత్యాయత్నం చేయడంతో.. గ్రామానికెళ్లిన అధికారులకు అక్కడ మరో రైతు కుటుంబం నిరసన తెలపడంతో వెనుదిరిగారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులుగౌడ్ తన భూమికి హద్దులు చూపాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో స్పందించిన తహసీల్దార్ కళ్యాణి.. రెండ్రోజుల్లో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శనివారం అధికారులు, సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. సర్వేనెంబర్ 208/1లోని ఎకరా 26 గుంటల భూమికి సంబంధించి సరిహద్దులను సర్వే చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మరో రైతు శంకరయ్య కుటుంబ సభ్యులు ఆ భూమి తమదంటూ ఆందోళనకు దిగారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు, కిరోసిన్ డబ్బాలతో అధికారుల ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు.. ఆ భూమి తమదంటే తమదంటూ గొడవకు దిగాయి. పోలీసులు ఇరువురినీ చెదరగొట్టారు. దాంతో అధికారులు ఈనెల 26న సర్వేకు వస్తామని వెనుదిరిగారు. ఆ భూమి గతంలో దొరల నుంచి దానంగా వచ్చింది.