Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ జేఏసీ బంద్కు మద్దతుగా ఐక్య కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ వైద్య ఉద్యోగ సంఘాలతో పాటు, ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తదితర ఐక్య కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కోఠిలోని వైద్య,ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్ఈయూ -సీఐటీయూ అనుబంధం) ప్రధాన కార్యదర్శి కె.బలరాం మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ పరిరక్షణకు సమ్మె చేస్తున్న 48 వేల మంది కార్మికులను తొలగించడం దారుణమన్నారు. హైకోర్టు సూచనలను ఖాతరు చేయకుండా ప్రయివేటీకరణకు పూనుకోవడం అన్యాయమని విమర్శించారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోగా, మరికొంత మంది గుండెపోటుకు గురైనా టీఆర్ఎస్ సర్కార్ మొండివైఖరి వీడడం లేదన్నారు. గత ఐదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ భక్షించేందుకు పూనుకుందని, కార్మికుల సీసీఎస్ డబ్బు రూ.580 కోట్లు, పీఎఫ్ డబ్బు రూ.860 కోట్లు వాడుకుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయానికి టీఎస్ఆర్టీసీ అప్పు రూ.2056 కోట్లు ఉంటే ఇది రూ.4,704 కోట్లకు చేరిందనీ, చాసిస్పై 14.5 శాతం ఉన్న వ్యాట్ స్థానంలో జీఎస్టీ 28 శాతం అయిందనీ, బస్ బాడీ నిర్మాణానికి గతంలో 5 శాతం వ్యాట్ ఉంటే జీఎస్టీ 28 శాతంకు పెంచారనీ, మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టాయని వివరించారు. 2018-19 పాస్ల రీయింబర్స్మెంట్్ కోసం ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.664 కోట్లకు గాను కేవలం రూ.130 కోట్లు మాత్రమే విడుదల చేసిందని పేర్కొన్నారు. గత ఐదేండ్లలో ఆర్టీసీ రూ.3921 కోట్లు పన్నులు చెల్లించిందని తెలిపారు. భారాలు తగ్గిస్తే ఆర్టీసీకి వేల కోట్ల మిగులు నిధులు ఉండేవనీ, అయినా ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో 50 లక్షల జనాభా పెరిగినా గతంలో ఉన్న 10,500 బస్సులే ఉన్నాయని, వాటిని పెంచలేదని, సిబ్బంది 7000 మంది తగ్గారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను వైద్య, ఆరోగ్య సంఘాలన్ని బలపరిచాయన్నారు. కార్యక్రమంలో బి.వేంకటేశ్వర్ రావు (ఐఎన్ టీయూసీ), నారాయణరెడ్డి (ఏఐటీయూసీ), రామలక్ష్మి (ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్)తో పాటు ఆయా సంఘాల నుంచి గోవిందరెడ్డి, హరిశంకర్, కవిత, వేణుగోపాల్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో: నగరంలోని బోధనాస్పత్రులు, నాచారంలోని ఈఎస్ఐ తదితర ప్రధాన ఆస్పత్రుల్లో వైద్య ఉద్యోగులు నిరసన చేపట్టారు. భోజన విరామ సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.