Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణచివేత కుట్రలను ఛేదించి ఆర్టీసీ కార్మికుల సమ్మె
- వ్యాపార సముదాయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూత
- బస్సులు నడిపేందుకు రాని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు
- పలుచోట్ల పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తతలు
నవతెలంగాణ-యంత్రాంగం
డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. అర్ధరాత్రి నుంచి పోలీసు బలగాహాలు మోహరించినా.. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు పూనుకున్నా.. ప్రభుత్వ అణిచివేత కుట్రలను కార్మికులు ఛేదించుకుని కార్మికులు తమ నిరసనలు కొనసాగించారు. సమ్మె 15వ రోజు సందర్భంగా సకల జనుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు హౌరెత్తాయి. పోలీసుల బందోబస్తు నడుమ బస్సులు నడిపించేందకు యత్నించినా తెల్లవారుజాము నుంచే కార్మికులు, నాయకులు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మరోవైపు వ్యాపార సముదాయాలు, దుకాణాల యజమానులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హైదరాబాద్ నగరంలోనూ క్యాబ్లు, ఇతర ప్రయివేటు వాహనాలు బంద్కు మద్దతుగా రోడ్డెక్కలేదు.
ఖమ్మం డిపో ఎదుట తెల్లవారుజామునే జేఏసీ నాయకులు, కార్మికులతో పాటు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావును పోలీసులు అరెస్టు చేసి నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జనగామలో ఉదయం 5 గంటలకే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. వరంగల్ అర్బన్, రూరల్ భూపాలపల్లి జిల్లాల్లో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిం చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో వామపక్షాల నాయకు లను పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులు, నాయకుల మధ్య తోపుటాల జరిగింది. ఆదిలాబాద్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సుందరయ్య భవనం నుంచి డిపో వైపు ర్యాలీగా వెళ్తుండగా డీఎస్పీ వెంకటేశ్వరరావు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో సీపీఐ (ఎం) నాయకులను దారిలోనే అడ్డగించిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. సిద్దిపేటలో బస్సులపైకి చెప్పులు విసిరారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సూపర్లగ్జరీ బస్సును బైపాస్ వద్ద ఆర్టీసీ కార్మికులు అడ్టుకుని టైర్లలో గాలి తీసేశారు. నిజామాబాద్ జిల్లా ముబారక్నగర్లో, బోధన్ లోని అచన్పల్లిలో బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నాయకులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి 1.30 నిమిషాల నుంచే వారి ఇండ్లలో సోదాలు చేపట్టారు. కరీంనగర్ డిపోలోంచి బస్సులు బయటకు వెళ్లకుం డా తెల్లవారుజామున డిపో ఎదుట బైటాయించారు. అరెస్టు చేయడంతో వామపక్షాపార్టీల ఆధ్వర్యంలో రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం పడుతున్నా లెక్క చేయలేదు. కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకోగా తోపులాట చోటుచేసుకున్నది. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ వినూత్న నిరసనలు
ఖమ్మం మధిరలో నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని గేదె మెడలో వేసి, దిష్టిబొమ్మను ఊరేగిస్తూ సీపీఐ(ఎం) నాయకులు నిరసన తెలిపారు. సత్తుపల్లి బస్ డిపో వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యం సేవించి నిద్రిస్తున్నట్టు ఓ కార్మికుడు బొమ్మ గీశాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో యూటీఎఫ్ నాయ కులు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. పోచంపల్లిలో కేసీఆర్ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు. మహబూబాబాద్లో కార్మికులు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో బతుక మ్మ, కోలాటాలు ఆడారు. నల్ల గొండ జిల్లాలో పలుచోట్ల ర్యాలీ లు, సహపంక్తి భోజనాలు చేశా రు. హైదరాబాద్లో బంజారాహి ల్స్ రోడ్ నెం.2 మినిస్టర్ క్వార్టర్స్ లో ఓయూ విద్యార్థులు సీఎం కేసీఆర్ శవయాత్ర చేపట్టారు.
సెల్టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
పిట్లం : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్క రించాలని కోరుతూ ఓ యువకు డు సెల్టవర్ ఎక్కి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. 15రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని చామకూర వెంకటేశ్ అనే వ్యక్తి ముకుందరెడ్డి కాలనీలో గల సెల్టవర్ ఎక్కాడు. దూకుతానం టూ హెచ్చ రించాడు. సమా చారం అందు కున్న స్థానిక ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి నచ్చజెప్ప డంతో కిందికి దిగాడు.
పోలీసుల దాష్టీకం.. ఉద్రిక్తతలు..
సంగారెడ్డిలో శ్రామిక మహిళావిభాగంతో కలిసి బంద్లో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులపై కొందరు పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. మెడపట్టి, గోళ్లతో రక్కి పైశాచికంగా వ్యవహరించారు. పోలీసుల దాడిలో సీపీఐ(ఎం) కార్యాలయ కార్యదర్శి క్రిష్ణకు గాయాలయ్యా యి. స్థానిక కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వతీరును నిరసించిన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ర్యాలీకి బయలుదేరేం దుకు సిద్ధమవుతుండగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్మల్లో బస్సులను బయటకు పంపాలని అధికారులు ప్రయత్నించగా ఆర్టీఓ, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న తోపులాటలో మహిళా కండక్టర్ చేతి గాజులు పగలడంతో చేతికి గాయరమైంది. పలువురు జేఏసీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూర్, మహేశ్వరం షాద్నగర్ మండలాల్లో అరెస్టుల సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. షాద్నగర్లో ఓ మహిళ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయింది. తోటి కార్మికులు కార్మికురాలిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లో పలుచోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ, డీవైఐఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి వ్యాన్లోకి ఎక్కించారు.
వందలాది మంది కార్మికులు, నాయకులు అరెస్ట్
నల్లగొండలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న వివిధ పార్టీల నాయకులు, కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా పోలీసులకు నడుమ వాగ్వివాదం తోపులాటలు జరిగాయి. మొత్తంగా 150 మందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మిర్యాలగూడలో శాంతియుతంగా ఆందోళన నిర్వస్తున్న 100 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 400 మంది కార్మికులను, నాయకులను అరెస్ట్ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం మూడు గంటల నుంచే వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టులు చేశారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 162 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 65 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. హైదరాబాద్లోని మల్కాజిగిరి చౌరస్తాలో 56 మంది అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసిన సీఐ.. నేరేడ్మెట్లో 14మందిని అదుపులోకి తీసుకున్నారు.