Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగమార్కెట్లో ఉచిత మందులు విక్రయం
- క్యాన్సర్ రోగులకు తప్పనితిప్పలు
- ఒక్కో రోగి నుంచి రూ.50 వేలు వసూలు
- చోద్యం చూస్తున్న సర్కార్
గరీబోళ్లకు ఏ రోగమొచ్చినా సర్కారు దవాఖానే దిక్కు. అక్కడ ఇచ్చే రంగు గోలీలు..టానిక్కులతో ఎలాగోలా కాలంవెళ్లదీయటం కామన్. ఇపుడు ఇక్కడ ఉచిత మందులు కూడా ఇవ్వటంలేదు. నో స్టాక్ అంటుంటే.. మళ్లా మందుల కోసం ఎప్పుడు రావాలని అడిగితే.. వచ్చినపుడు ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఫ్రిమెడిసిన్స్ అడ్డదారిలో బహిరంగమార్కెట్లో విక్రయించేసుకుని వాటాలు పంచుకుంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సర్కారు కూడా పట్టించుకోకపోవటంతో.. క్యాన్సర్ రోగులనుంచి 50వేలకు పైగా దండుకుంటున్నారు.
కొత్తూరు ప్రియకుమార్
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దండుకోవడమే. శవాలను పీక్కుతినే రాబందులను తలపిస్తున్నారు. గద్దల్లా వాలిపోవడమే వారిపని. మొద్దనిద్రపోతున్న ప్రభు త్వాలపై బలమైన నమ్మకం వారికి. తామెంత దోపిడీ చేసినా తమను అడిగే వారెవరూ ఉండరనే ధీమా. చివరకు ఈ బరితెగింపు దోపిడీ చావుబతుకుల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తున్న క్యాన్సర్ రోగులనూ వదల్లేదు. ఔషధాల ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నామని ఒకవైపు సర్కారు ప్రచారం చేసుకుంటున్న
ఇప్పటికీ పలు ఔషధాలు సామాన్యులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సరఫరా అసలు లేనేలేదు. బయట కొనుక్కోవాల్సిందే. అయితే ఆ ఖరీదైన మందులను కొనేస్థోమత లేని పేదరోగులు చావు కోసం ఎదురుచూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ పేద, నిరుపేద రోగులను ఆదుకునేందుకు కొంత మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అత్యంత ఖరీదైన మందులను సైతం ఉచితంగా అందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న నిరుపేద రోగులను ఆదుకుంటున్నాయి. కాగా ఉచితమందులపైనా దళారీల కన్ను పడింది. క్యాన్సర్ ముదిరిన దశలో వచ్చే రోగులకు సాధారణంగా చేసే కీమోథెరపీకి బదులుగా కొన్ని ఖరీదైన మందులను వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాంటి మందుల్లో పాల్బొసిక్లిబ్ 125ఎంజీ ఒకటి. ఇది 21 ఔషధాలు కలిగిన ఒక్కో స్ట్రిప్ రూ.95,000 . ఇలాంటివి 10 స్ట్రిప్ లను ఒక పూర్తి కోర్స్ గా వాడాలని వైద్యులు చెబుతున్నారు. అంటే ఒక్కో రోగికి పూర్తి కోర్స్ అయ్యే సరికి రూ.9,50,000 ఖర్చవుతున్నది. పాల్బొసిక్లిబ్ లో ఉన్న కాంపొనెంట్స్ కలిగిన పాల్బొసెంట్ 125ఎంజీ మాత్రం రూ.20 వేల వరకు దొరుకుతుండడం గమనార్హం. ఇది పూర్తి కోర్స్ వాడేందుకు రూ.2 లక్షల దాకా అవసరమవుతాయి. పేద, నిరుపేద రోగులు మాత్రం వీటిలో దేనిని కొనే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారి కోసం ముంబయికి చెందిన వి కేర్ ఫౌండేషన్ ఉచితంగా పాల్బొసెంట్ 125ఎంజీ ఔషధాలను ఉచితంగా ఇస్తూ ఆదుకుంటున్నది. వీటిని ఖరీదు చేసేందుకు ఫార్మసీకి వెళ్లిన రోగులు మాత్రం వాటి ధర విని హతాశులై వెనక్కి మళ్లుతున్నట్టు తెలిసింది. ఇలాంటి రోగులను దళారీలు లక్ష్యంగా చేసుకుని తాము మందులను తెప్పిస్తామనీ, వాటి ఖరీదు రూ.9.50 లక్షలు అవుతుందనీ అంటున్నారు. అయితే తమకు రూ.50 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు ఇవ్వాలని షరతు పెడుతున్నారు. ఉచిత మందుల సౌకర్యం ఉన్న సంగతి తెలియని రోగులు వారికి అడిగిన డాక్యుమెంట్లు, అడిగినంత డబ్బును ఇచ్చుకుని మందులను తెప్పించుకుంటున్నారు.
బంజారాహిల్స్ కేంద్రంగా దందా
క్యాన్సర్ రోగులకు అవసరమైన మందులు దొరికే ఒక ఫార్మసీ దగ్గర్లో ఈ దళారీ దందా కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఫార్మసీకి వచ్చే పేద రోగులు ఈ ధరలు విని కొనలేకవెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితుల్లో అక్కడే ఆ దళారీ అయితే తెప్పించి ఇస్తాడని సమాచారం ఇచ్చి ప్రోత్సహిస్తారు. గతంలో ప్రయివేటు ఆస్పత్రిలో పని చేసిన దళారీ ఉచిత మందులను అమ్ముకునే దారి తెలియడంతో 2015లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఈ దందా మొదలుపెట్టినట్టు సహౌద్యోగులు చెబుతున్నారు. అప్పట్నుంచి ఒక్కో రోగి దగ్గర నుంచి రూ.50 వేలు ఆ పైగా దండుకుంటున్న దళారీ చేసే పనికి ఫౌండేషన్ లో కూడా కొంత మంది అండదండలు ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫౌండేషన్ లోనూ దళారీలతో ఉద్యోగుల దోస్తీ?
దేశవ్యాప్తంగా పేద క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకు స్థాపించిన వి కేర్ ఫౌండేషన్ లో కొంత మంది ఇలాంటి దళారీలకు అండగా నిలుస్తున్నారని సమాచారం. అందుకే రోగులకు నేరుగా ఔషధాలు చేరకుండా మధ్య దళారుల చేతికి అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగుల నుంచి పూర్తి వివరాలు సేకరించినప్పటికీ మందులు వారికి కాకుండా దళారులకు వచ్చేలా ఫౌండేషన్ లోని కొంత మంది సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఔషధాల నియంత్రణ అధికారులు ఇలాంటి దందాలను అరికట్టి పేదరోగులకు న్యాయం చేయాల్సిన అవసరమెంతైనా ఉన్నది.