Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా పోలీసుల అణచివేత
- ప్రతిఘటించిన వామపక్షాలు
- హైదరాబాద్లో భారీ నిరసన
- ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్
- హిట్లర్లా శాసిస్తున్న కేసీఆర్ : తమ్మినేని
- న్యూడెమోక్రసీ నేత రంగారావు చేతికి గాయం
- పోలీసుల దురుసు ప్రవర్తనతో తెగిన బొటనవేలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల రాష్ట్రబంద్పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసులు అడుగడుగునా అణచివేత ధోరణిని ప్రదర్శించారు. సర్కారు నిర్బంధం ప్రయోగించినా ఎర్రదండు కదిలింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై సమరభేరి మోగించాయి. వామపక్ష పార్టీలకు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని ఎంబీ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్డు వరకు భారీగా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రబంద్ నేపథ్యంలో అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. వాపక్షాల నిరసనతో ఆర్టీసీ క్రాస్రోడ్డు ప్రాంతం అట్టుడికిపోయింది. సీఎం డౌన్... డౌన్ నినాదాలతో ఆర్టీసీ క్రాస్రోడ్డు దద్దరిల్లింది. పోలీసుల జులుం నశించాలి, ప్రభుత్వ మొండివైఖరి నశించాలి, విరు వాంట్ జస్టిస్, ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 'ఆర్టీసీ కార్మికుల కోర్కెలు గౌరవించండి. దొరాధిపత్యం విడనాడండి. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ పన్నులే కారణం, కార్మికులు కానేకాదు. ఆర్టీసీ ఆస్తులు, భూములను అమ్ముకునేందుకే ప్రయివేటీకరణ జపం. కార్మికుల పట్ల నియంతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ డౌన్డౌన్'అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. రెండుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, జి రాములు, డిజి నరసింహారావు, బి వెంకట్, ఎన్ బాలమల్లేష్, కె రమ, ఝాన్సీ, సాధినేని వెంకటేశ్వరరావు, కె గోవర్ధన్లతోపాటు తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, విమలక్క, పీవోడబ్ల్యూ నేత సంధ్య వామపక్ష పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్స్టేషన్కు తరలించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్, ఎం శ్రీనివాస్, మల్లు లక్ష్మి, స్కైలాబ్బాబు, అబ్బాస్లను అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటుచేసుకుంది. అయినా పోలీసులు ఒక్కొక్కరిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కొందరు నాయకులు వాపోయారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్బాబు గొంతు నులిమారు. దీంతో స్పృహ తప్పి పడిపోయారు. మరో కార్యకర్తను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో తలకు బలంగా గాయమైంది. దీంతో అక్కడే కిందపడిపోయారు. ఇక వామపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఎడమ చేతికి గాయమైంది. వాహనంలోకి ఎక్కించిన పోలీసులు డోరు మూస్తున్న సమయంలో రంగారావు బొటనవేలు తెగిపోయింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారావును తమ్మినేని వీరభద్రం, కోదండరామ్, చెరుకు సుధాకర్, వేములపల్లి వెంకట్రామయ్య, సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం : తమ్మినేని
హిట్లర్ మాదిరిగానే నేడు తాజా హిట్లర్ కె చంద్రశేఖర్రావు తెలంగాణను శాసించడానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవకపోవడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. చర్చలకు ఆహ్వానించకపోతే ఈనెల 28వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టే వరకు ప్రతిరోజూ కార్యాచరణతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం కోర్టు ధిక్కరణగా పరిగణించాలని అన్నారు.
కేసీఆర్ దిగొచ్చేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో నియంతలెవరూ మిగల్లేదని ప్రజల చేతిలో మట్టికరవకతప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు.
ప్రభుత్వం మెట్టు దిగాలి : బాలమల్లేష్
టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రబంద్ విజయవంతమైందని చెప్పారు. ప్రభుత్వం ఇలాగే నిరంకుశంగా వ్యవహరిస్తే పోరాటం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు.
ఇది కేసీఆర్ బహుమానమా? : పి రంగారావు
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, జైలుకు వెళ్లానని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. బొటనవేలు తెగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది దొరహంకారమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు కేసీఆర్ ఇచ్చిన బహుమానమా?అని ప్రశ్నించారు. పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?అని విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతున్నదని అన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చట్టం, ప్రజలు, రాజ్యాంగం మీద గౌరవముండాలని అన్నారు. కానీ సీఎం కేసీఆర్కు అలాంటివేవీ లేవన్నారు.
కేసీఆర్కు సోయి ఉందా? : సాధినేని
ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం కేసీఆర్కు సోయి ఉందా?అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రయివేటీకరణ చర్యలను ఆపాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కె గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఆస్తులు అమ్ముకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పీవోడబ్ల్యూ నేత సంధ్య విమర్శించారు.
సమ్మె జన్మహక్కు : విమలక్క
సమ్మె చేయడం కార్మికుల జన్మ హక్కు అని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క అన్నారు. హైకోర్టు ఆదేశించినా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవకపోవడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డు వద్ద నిరసన తెలిపిన ఎమ్మార్పీఎస్, తెలంగాణ జనసమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎంజీబీఎస్ వద్ద వామపక్షాల నిరసన
రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎంజీబీబీఎస్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వామపక్ష పార్టీల నాయకులు అక్కడికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, జాన్వెస్లీ, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, నగర కార్యదర్శి ఈటి నర్సింహ్మా తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
అంతకుముందు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరితో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కోటి మంది ప్రయాణికులు, 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను హింసిస్తున్నదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించడం లేదన్నారు. ప్రజల తిరుగుబాటుకు కేసీఆర్ ఆహుతి కాక తప్పదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ హైకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. నియంతృత్వ పోకడలకు ప్రజలు రాజకీయంగా సమాధి కడతారని హెచ్చరించారు. చర్చలు జరపకపోతే సకల జనుల సమ్మెగా మారుతుందన్నారు.
మఖ్దూంభవన్ వద్ద చాడ అరెస్టు
హైదరాబాద్లోని మఖ్దూంభవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్పాషాలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో పాల్గొనకుండా, కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న తమను అకారణంగా, అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.