Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.35.19 కోట్లతో నిర్మాణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా 391 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబోరేటరీలు ఏర్పాటు కానున్నాయి. సమగ్ర శిక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా 391 ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్ల నిర్మాణానికి రూ.35.19 కోట్లతో నిర్మాణం జరగ నుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమగ్ర శిక్ష ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు మే 21న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఒక్కో పాఠశాలకు రూ.9 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ ల్యాబ్ల నిర్మాణంతో విద్యాప్రమాణాలు మెరుగవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ టి విజరుకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ల ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్, పై చదువులకు వెళ్లే విద్యార్థులకు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు థియరీతోపాటు ప్రాక్టికల్గా సైన్స్ విషయాలను తెలుసుకునేందుకు అవకాశం దొరుకుతుందని సూచించారు. 30 జిల్లాల్లోని 391 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లను నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) డైరెక్టర్ సైన్స్ ల్యాబ్ల నిర్మాణ ప్రక్రియ చేపడతారని సూచించారు. ప్రతినెలా ఐదో తేదీన ల్యాబ్ నిర్మాణానికి సంబంధించిన ప్రగతిపై సమీక్ష ఉంటుందని తెలిపారు.
జేపాల్ సంస్థతో విద్యాశాఖ ఒప్పందం
ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ నేతృత్వంలోని జేపాల్ సంస్థతో పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డి జిల్లాస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్, ఇతర అధికా రులు పాల్గొన్నారు. మూడో తరగతిలోపు విద్యార్థులు పఠన, గణిత నైపుణ్యాలు సాధించేదిశగా ఒప్పందం కుదుర్చుకున్నామని విజరుకుమార్ తెలిపారు. ఇది తప్పులు వెతకడానికి ఉద్దేశించింది కాదని, విద్యావిధానాన్ని సమూలంగా పరీక్షించి అభ్యసన ఫలితాల సాధనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఈ సంస్థకు సహకరించాలని కోరారు.