Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ బెంచ్కు బదిలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ భారీ సంఖ్యలో అద్దె బస్సులు తీసుకునేందుకు ఆహ్వానించిన టెండర్ ఖరారు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రజాహిత వ్యాజ్యాలు విచారణకు ఉన్నందున ఈ రిట్ను కూడా ఆయన నేతత్వంలోని డివిజన్ బెంచ్కు నివేదించాలని సింగిల్ జడ్జి హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. పిల్స్పై 28న విచారణ జరగనుంది. వీటితోపాటే రిట్ను కూడా డివిజన్ బెంచ్ విచారించే అవకాశం ఉంటుంది. వివరాల్లోకి వెళితే.. టీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఫ్ు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేష్కుమార్ దాఖలు చేసిన రిట్ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి విచారించారు. తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ టి.సూర్య కిరణ్రెడ్డి వాదిస్తూ.. ఒక పక్క ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా భారీ స్థాయిలో 1035 ప్రయివేటు బస్సుల్ని అద్దెకు తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదన్నారు. సమ్మె పరిష్కారమైతే అన్ని ప్రైవేటు బస్సుల్ని ఏం చేస్తారో తెలియదని, ఆర్టీసీని నిర్వీర్యం చేసే క్రమంలోనే అంత భారీ సంఖ్యలో ప్రయివేటు బస్సుల్ని ఏడాదిపాటు అద్దెకు తీసుకునేందుకు టెండర్ ఆహ్వానించిందన్నారు. ఆర్టీసీకి మేనేజింగ్ కమిటీ (బోర్డు) లేదని, శాశ్వత ప్రాతిపదికపై ఆర్టీసీకి ఎండీ కూడా లేరని, చాలాకాలంగా ఇన్చార్జి ఎండీనే ఉన్నారని చెప్పారు. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికపై బస్సుల్ని తీసుకుంటే అభ్యంతరం లేదని, ఏడాది కాలానికి టెండర్ ఆహ్వానించడంపైనే అభ్యంతరమని తెలిపారు. గతంలో తొలగింపునకు గురైన వారిని అనర్హులుగా ప్రకటించడం చెల్లదన్నారు. ఒకసారి అనర్హుడైన వ్యక్తి మరో ఉద్యోగం చేయకూడదని లేదన్నారు. తక్షణమే హైకోర్టు జోక్యం చేసుకుని టెండర్ ఖరారు కాకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలని సూర్యకిరణ్రెడ్డి కోరారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్రావు వాదిస్తూ.. అసలు ఈ పిటిషనే చెల్లదని, దీనిని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని కోరారు. టెండర్ ఆహ్వానించాలన్న నిర్ణయం ఆర్టీసీ బోర్డుది కాదని, ఆర్టీసీ యాక్ట్లోని సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో అద్దె బస్సులకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పిటిషనర్ ఏమీ టెండర్లో పాల్గొనలేదని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని, ఎందుకు రిట్ వేశారో అర్ధం కావడం లేదన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ప్రయాణీకుల కోసమే బస్సుల్ని వీలైనన్ని ఎక్కువ నడిపేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకుంటోందని వివరించారు. బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు ప్రధాన న్యాయ మూర్తి ఆదేశాలిచ్చారని, ఈ నేపథ్యంలో రిట్ను కొట్టేయాలని కోరారు. బస్సు ల్ని నడుపుతుంటే అడ్డుకుంటున్నారని, అద్దె బస్సుల్ని తీసుకుంటుంటే కేసులు వేస్తున్నారని, ప్రయాణీకులకు సౌకర్యాలు లేకపోతే మళ్లీ వాళ్లే కల్పించుకుని ప్రయాణీకుల ఇక్కట్లు ప్రభుత్వానికి పట్టడం లేదని ద్వంద్వ విధానాల్ని అవ లంభిస్తున్నారని ఆరోపించారు. టెండర్లను నిన్ననే తెరవడం జరిగిందని, ఇప్పుడు హైకోర్టుకు వచ్చి కేసు వేసి ఉపయోగం లేదన్నారు. ఆర్టీసీకి సొంతం గా 10,460 బస్సులుంటే వాటిని నడపలేని పరిస్థితులు ఉన్నాయని, ఇప్పు డు ప్రయివేటు బస్సుల్ని తీసుకుంటేనే ప్రయాణీకులకు సమస్యలు లేకుండా రవాణా వ్యవస్థ ఉంటుందని అదనపు ఏజీ చెప్పారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని డివిజన్ బెంచ్కు నివేదించాలని న్యాయమూర్తి హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ కల్పించుకుని, దీర్ఘకాలిక ప్రాతిపదికపై టెండర్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, తాత్కాలిక ప్రాతిపదికపై అభ్యంతరం లేదని, ఈ మేరకు మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కూడా డివిజన్ బెంచ్ ఎదుట తేల్చుకోవాలని న్యాయమూర్తి చెప్పారు.