Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల కోసం 24 నుంచి మూడ్రోజుల పాటు సంఘీభావ నిధి సేకరణ : సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇవ్వటానికి తమ సంస్థ దగ్గర డబ్బుల్లేవనీ, కేవలం రూ.7.49 కోట్లు మాత్రమే ఉన్నాయని తప్పుడు నివేదిక ఇచ్చిన ఆర్టీసీ ఇన్చార్జి ఎమ్డీపై హైకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఆర్టీసీ కార్మికుల కోసం సంఘీభావ నిధి సేకరణ చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసిన సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించకపోవటం పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ - 1936 ప్రకారం నేరమనీ, తిరిగి ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి హైకోర్టుకు అవాస్తవాలతో ప్రభుత్వం తరపున నివేదిక ఇవ్వటం మరో నేరమని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రజలంతా ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి ప్రతిరోజూ రూ.11.48 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వమే చెప్తున్నదనీ, దీని ప్రకారం సమ్మె లేని సెప్టెంబర్ నెలలో వచ్చిన సుమారు రూ.345 కోట్ల ఆదాయాన్ని ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం కోర్టుకిచ్చిన నివేదికలో కార్మికుల నెల వేతనాల ఖర్చు రూ.240 కోట్లుగా పేర్కొన్నదనీ, అలాంటప్పుడు సెప్టెంబర్ నెల ఆదాయం రూ.345 కోట్ల నుంచి వేతనాలు చెల్లించేందుకు వచ్చిన ఆటంకం ఏమిటి? అని నిలదీశారు. ఇది కార్మికులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించటమేననీ పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలకు కార్మిక కుటుంబాలను పస్తులతో ఉంచాలని ప్రభుత్వం భావించటం ఆటవిక న్యాయం తప్ప మరోటి కాదని విమర్శించారు. ప్రభుత్వ మొండి వైఖరితో రోజురోజుకు చనిపోతున్న కార్మికుల సంఖ్య, యాక్సిడెంట్లలో మరణిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రయాణికులను చంపే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రజాస్వామిక వాదులంతా ప్రశ్నించాలని కోరారు.