Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ- జాక్టో డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వెంటనే చర్చలు జరిపి సమ్మెను విరమింపచేసేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. ఈ మేరకు యూఎస్పీసీ, జాక్టో నాయకులు సిహెచ్ రాములు, చావ రవి, జి సదానందంగౌడ్, ఈ రఘునందన్, వై అశోక్కుమార్, ఎం రాధాకృష్ణ, యు పోచయ్య, జి సోమయ్య, సయ్యద్ షౌకత్అలీ, కె కృష్ణుడు, కొమ్ము రమేశ్, శ్రీనివాస్, జాడి రాజన్న, ఎ గంగాధర్, మసూద్ అహ్మద్, ఎస్ హరికృష్ణ, శాగ కైలాసం, బి కొండయ్య, కె రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 23న సాయంత్రం ఆర్టీసీ డిపోల వద్ద చనిపోయిన కార్మికులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని కోరారు.
ఈనెల 24న పట్టణ ప్రాంతాల్లో జరిగే మహిళా కార్మికుల దీక్షలలో పాల్గొని సంఘీభావం ప్రకటించాలని తెలిపారు. ఈనెల 25న సాయంత్రం తాలుకా/డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనగా వెళ్లి ఆర్డీవో/ఎంఆర్వోలకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.