Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర అంశాలను పరిశీలిస్తాం...
- ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్
- డిమాండ్ల పరిశీలనకు ఈడీలతో కమిటీ ఏర్పాటు
- తక్షణం వెయ్యి అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆదేశాలు
- ఆర్టీసీలో ప్రయివేటీకరణకు అవకాశం కల్పించింది బీజేపీ సర్కారే
- కేంద్రం తెచ్చిన చట్టాన్నే మేం అమల్జేస్తామన్నాం
- ఈ అంశంపై ప్రధానికి లేఖ రాస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించేందుకోసం ఆర్టీసీ ఎమ్డీ.. ఆ సంస్థ ఈడీలతో కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ప్రగతి భవన్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొద ట ప్రకటించారు. అదే తమ ప్రథమ అవసరం అని కూడా వారు చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుబట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రాబోమనే విధంగా కార్మికులు ఎప్పుడూ చెప్పలేదంటూ కోర్టుకు తెలిపారు. దీంతో కార్మికులు విలీన డిమాండ్ను వదులుకున్నట్టయింది. వారు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి' అని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎమ్డీగా వ్యవహ రిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆరుగు రు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎమ్డీకి అందించనుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుం డా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సీఎం ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకడం అనైతికమని సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 'కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ విషయంలో చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (ఆర్టీసీ)నూ, రూట్లనూ ప్రయివేటీకరించటానికి చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజరుసింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నాయి. 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రయివేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దంటూ ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్లో సవరణలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లును ఆమోదించి, చట్టం చేసింది. 'మోటార్ వెహికిల్ (అమెండ్మెంట్) యాక్టు 2019' పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రయివేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికీ, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికీ పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొంది. మొబైల్ రంగంలోనూ, విమానయాన రంగంలోనూ ప్రయివేటుకు అవకాశం కల్పించడంవల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయనీ, సౌకర్యాలు పెరిగాయనీ కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు...' అని సీఎం విమర్శించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే.. స్థానిక బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు...' అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధానికీ, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికీ లేఖ రాయాలనే విషయంపై ఆయన చర్చించారు.