Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-మంగపేట
పంచలోహ విగ్రహాలు అమ్ముతున్న 11మందిని అరెస్టు చేసినట్టు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శరత్చంద్ర తెలిపారు. మంగపేట పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున తిమ్మంపేట క్రాస్ వద్ద ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టారు. మణుగూరు వైపు నుంచి మంగపేట వస్తున్న కారులోని వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. అందులో ఉన్న 11 మంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కారులో తనిఖీ చేశారు. సుమారు 4.690 కిలోల కనకదుర్గ పురాతన పంచలోహ విగ్రహం, 3.470 కిలోల బుద్ద పంచలోహ విగ్రహం, 200 రాగి నాణేలు, 47 తెలుపు, 13 పసుపుపచ్చ, 14 ఆకుపచ్చ రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిసర ప్రాంతాల్లో పురాతన పంచలోహ విగ్రహాలు, రంగు రాళ్లు దొరుకుతాయనే సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు వెంకటాపురంలో అందరూ కలుసుకున్నారు. అక్కడ నుంచి చర్లలోని ఓ అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి పైన పేర్కొన్న వస్తువులకు సుమారు రూ.9.75 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా మూడు లక్షలు ఇచ్చారు. తిరిగి వస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. మేడారానికి చెందిన గుండపు లక్ష్మణ్, పోరిక నరేష్, ఏడూళ్లబయ్యారానికి చెందిన వెన్న ప్రవీణ్, పందిరిపల్లి ఆనంద్, పినపాక మండలం తోగ్గూడెంకు చెందిన బగుతు చిరంజీవి, వాజేడుకు చెందిన సవలం సుధాకర్, వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన ఎడ్ల సంపత్కుమార్, వెంకటాపురం మండలం కె.కొండాపురానికి చెందిన పిన్నపల్లి కృష్ణ, మణుగూరుకు చెందిన కీసర దేవేందర్, నగునూరి వెంకటేశ్వర్లు, సాంబాయగూడెంకు చెందిన కొరిపెల్లి వెంకన్నను రిమాండ్కు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు.