Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు రుణమాఫీ కోసం బడ్జెట్లో ప్రకటించిన రూ 6వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు ఇవ్వకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ లక్ష్యంగా భారీగా పెట్టుకున్నా...ఇప్పటికీ 28 లక్షల మందికి మించి పంట రుణాలు ఇవ్వలేదని తెలిపారు. 27 లక్షల మంది రైతులు రుణం కోసం బ్యాంకు గడప తొక్కని వారే ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం ఎస్వీకేలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షతన రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఇప్పటికీ రైతులు ప్రయివేట్ రుణాలపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. పంటరుణం ఇవ్వకపోవడం వల్ల ఈసారి పంట బీమాకు ప్రీమియం వసూలు చేయలేదన్నారు. రుణం పొందని వారు స్వచ్ఛందంగా బీమా చెల్లించే పరిస్థితి లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్బీమా వచ్చిన తర్వాత రాష్ట్రంలో 18 లక్షల మందికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల కొరతను సాకు చూపించి, రైతు బంధు పథకానికి ఎగనామం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అంతకు ముందే 9 లక్షలమందికి పాసు పుస్తకాలు లేకుండా గత మూడు వాయిదాలను రైతులు పొందలేదని చెప్పారు. గతేడాది రబీ పంటకు మార్కెట్లలో కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ ధర అమలు కాలేదన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, వి సంజీవరెడ్డి, మూడ్ శోభన్, బొంతు రాంబాబు, నాగిరెడ్డి, మధుసూధన్రెడ్డి, మాదిలేని లక్ష్మి, బండి పద్మ, తదితరులు పాల్గొన్నారు.