Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే రోజు వైదొలిగిన రెండువేల మంది తాత్కాలిక డ్రైవర్లు
- సెలవుల ముందుకంటే తక్కువగా రోడ్డెక్కుతున్న బస్సులు.
- డ్రైవర్లను పంపాలని విద్యాసంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాలలు పున:ప్రారంభమైనా బస్సులను ప్రజలకు అందుబాటులో తేవడంలో ఆర్టీసీ యాజమాన్యం విఫలమైంది. డ్రైవర్లు లేక బస్సులు రోడ్డెక్కించడంలో అధికారులు హైరానా పడుతున్నారు. మొన్నటి వరకు అద్దెబస్సులు, స్కూల్బస్సుల డ్రైవర్లతో ప్రభుత్వం నెట్టుకొచ్చింది. సోమవారం నుంచి బడులు మొదలవడంతో దాదాపు 2వేల మంది స్కూల్ బస్సుల డ్రైవర్లు ఒకే రోజు వైదొలిగారు. కాగా డ్రైవర్ల కోసం జిల్లాల్లో ఆర్టీఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. కొన్ని బస్ డిపోలలో అయితే రోజుకు రూ. 2వేలు ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ డ్రైవర్లు దొరకడం లేదు. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగునంగా బస్సులను నడపడంలో డిపో మేనేజర్లు నానా తంటాలు పడుతున్నారు. గత మూడు రోజులుగా బస్టాండ్లల్లో ప్రయాణీలు గంటల తరబడి ఎదురు చూస్తున్నా బస్సులు దొరకడం లేదు. ఆదే అదనుగా ప్రైయివేటు ట్రావెల్స్ అందినంత దోచుకుంటున్నారు.
ఆర్టీసీకి 10,460 సొంత బస్సులు, 2856 అద్దె బస్సులున్నాయి. వీటి నిర్వహణకు 18564 మంది డ్రైవర్లు, 20313 మంది కండక్టర్లు పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హమీలను అమలు చేయాలని గత 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దసరాకు ముందు సమ్మె చేపట్టడంతో హడావుడిగా ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీ కార్మికులతో చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదు. ఒక వైపు దసరా పండుగ, మరోవైపు విద్యాసంస్థల సెలవులతో రాష్ట్రంలో ప్రయాణికులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ తదితర ప్రాంతాలలో ప్రజలు రాత్రుళ్లు జాగారం చేశారు. వెంటనే తేరుకున్న సర్కార్ రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలను నయానో బయానో ఒప్పించి దాదాపు రెండు వేల మందికి పైగా స్కూల్ బస్సు డ్రైవర్లను రంగంలోకి దించింది. దింతో అద్దె బస్సులకుతోడు ఆర్టీసీ బస్సులు రొడ్డెక్కడంతో ప్రభుత్వం కొంతమేరకు ఊపిరి పీల్చుకుంది. అయితే పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 13న ముగియాల్సి ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం కష్టమవుతుందని భావించి ఏకంగా సెలవులను 19వరకు పొడిగించారు. ఈ లోపుా బస్సుల నిర్వహణను గాడీలో పెట్టాలని భావించినప్పటికీ నిపుణులైన డ్రైవర్లను వెదికి పట్టుకోవడం సాద్యం కాలేదు. దాంతో ప్రభుత్వం దసరా సెలవులను మరో వారం రోజుల పాటు పెంచాలని ఒక దశలో ఆలోచించినప్పటికి విద్యార్థుల చదువులను పణంగా పెడుతున్నారని వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో విరమించుకుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు ఈనెల 21 నుంచి యదావిధిగా పారంభమవడంతో ఆర్టీసీలో తాత్కాలికంగా పనిచేస్తున్న 2వేల మంది స్కూల్ బస్సుల డ్రైవర్లు ఒకే రోజు మానేయడంతో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులను నడిపించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. విద్యాసంస్థల ప్రారంభంతో సమ్మె ప్రారంభానికి ముందు వారం రోజుల పాటు ప్రయాణికులు ఎదుర్కొన్న కష్టాలు తిరిగి మొదలయ్యాయి. దానికి తోడు అద్దె బస్సులు సైతం అనుకున్న మేరకు తిరగడం లేదు. గత నాలుగు నెలలుగా తమకు చెల్లించాల్సిన పూర్తి స్థాయి బకాయిలు చెల్లిస్తేనే బస్సులను తిప్పుతామని కొంతమంది అద్దె బస్సుల యజమానులు మొండికేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఇన్ని వేల బస్సులు నడిపాం, అన్ని వేల బస్సులు నడిపామని చెబుతున్నామే తప్ప అవసరానికి తగ్గట్టుగా నడపటంలేదని స్వయంగా అధికారులే ప్రయివేటు సంబాషణల్లో ఒప్పుకుంటున్నారు. దీంతో గత మూడు రోజులుగా బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యాసంస్థలపై ఒత్తిడి
డ్రైవర్ల కొరతతో ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా బస్సులను రోడ్డెక్కించలేక అధికారులు హైరానా పడుతున్నారు. సమ్మె విరమించే వరకు విద్యాసంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న స్కూల్ బస్సుల డ్రైవర్లలో సగం మందిని పంపించాలని ఆర్టీఏ, రెవెన్యూ, విద్యాశాఖ అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు యాజమాన్యాలు చెబుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ ఒత్తిడి మరో వైపు తమ విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉండడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.