Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తు పట్టలేని స్థితిలో ఏడు మృత దేహాలు
- ఫలించిన ధర్మాడి సత్యం బృందం కృషి
దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయట కు తీశారు. ఘటన జరిగిన 38 రోజుల తర్వాత దీనిని వెలికితీయడం గమనార్హం. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ప్రయత్నాలు కొద్దిరోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, సత్యం బృందం, విశాఖ నుంచి తీసుకొచ్చిన స్కూబా డ్రైవర్లు.. నదీగర్భంలోకి వెళ్లి బోటును లంగర్లు, ఐరన్రోప్ల సాయంతో పైకి లాగారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఏడు మృతదేహాలను గుర్తించిన అధికారులు.. వాటిని అక్కడ్నుంచి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి. గతనెల 15న 77 మందితో పాపికొండల పర్యటనకు బయలుదేరిన వశిష్టబోటు.. కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా.. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ దొరకలేదు. దీంతో అప్పటినుంచి బోటు వెలికితీత ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యపడలేదు. దీనిపై ధర్మాడి సత్యం స్పందిస్తూ.. లోతు ఎక్కువగా ఉండటం వల్లే బోటు వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు.