Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కానిస్టేబుల్ పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ వందలాది మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. మార్గమధ్యంలోనే వారిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా అభ్యర్థులు చేసిన నినాదాలతో గోషామహల్ స్టేడియం హౌరెత్తింది. కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయనీ, ముఖ్యంగా నార్మలైజేషన్ విధానం కారణంగా అర్హులైన అభ్యర్థులు అనేక మందికి పోస్టులు లభించక అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందలాది తమంది కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్కు తరలివచ్చారు. వివిధ మార్గాల ద్వారా వారు ప్రగతిభవన్కు చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ప్రగతి భవన్కు వచ్చే మార్గాలలో పెద్ద ఎత్తున మోహరించి అభ్యర్థులను అడ్డుకున్నారు. కాగా తాము న్యాయం చేయాలని కోరుతూ సీఎంను కలవాలని వచ్చామనీ, ఎలాంటి ఆందోళనలు చేయమని అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా పోలీసులు వినకుండా వచ్చిన వారిని వచ్చినట్టే వాహనాలలోకి తోసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టయిన వారిని గోషామహల్ స్టేడియంతో పాటు సీపీఎల్ అంబర్పేట్, పంజగుట్ట పోలీసు స్టేషన్ తదితర ప్రాంతాలకు తరలించారు. గోషామహల్కు తరలించిన అభ్యర్థులు అక్కడే నిరాహార దీక్షకు దిగారు. వాట్సాప్, టీవీల ద్వారా ఇతర ప్రాంతాలలో ఉన్న అభ్యర్థులందరూ గోషామహల్కు తరలిరావాలని పిలుపు నిచ్చారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అనేక మంది పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిన కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్లులు సాధించిన వారున్నారనీ, అయినప్పటికి వారిని ఎంపిక చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా అనేక మంది అభ్యర్థులు ఆరోపించారు. వరంగల్కు చెందిన మహిళా అభ్యర్థి ఒకరికి కటాఫ్ మార్కుల కంటే రెండు మార్కులు 120 వచ్చినా ఎంపిక చేయలేదని వారు ఆధారాలతో సహా చూపించారు. అలాగే లోకల్, నాన్ లోకల్ అభ్యర్థుల విషయంలోను అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నార్మలైజేషన్ విధానం ద్వారా అనేక మంది అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని మహిళా అభ్యర్థులు అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, బోర్డు చైర్మెన్ వివి శ్రీనివాసరావులను కలిసి మొరపెట్టుకున్నామనీ, కాని వారు తాము చేసిందే ఒప్పని వాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన పోరాటాన్ని వదలబోమనీ, ఇప్పటికైనా సీఎం ముందుకు వచ్చి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్డౌన్, నార్మలైజేషన్ విధానాన్ని ఎత్తి వేయాలంటు అభ్యర్థులు చేసిన నినాదాలు గోషామహల్లో మిన్నంటాయి.